యాచారం: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ విమర్శించారు. మండల కేంద్రంలో మంగళవారం డీవైఎఫ్ఐ జిల్లా మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాబ్ క్యాలెండర్ వేస్తామని ప్రకటించిన ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని అన్నారు. నిరుద్యోగ భృతి, స్వయం ఉపాధి కోసం ఆర్థిక రుణాలు, రాజీవ్ వికాస్ పథకం కోసం దరఖాస్తులు స్వీకరించి నిధులు మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. జిల్లాలో అనేక పరిశ్రమలు ఏర్పాటవుతున్నా స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడం లేదన్నారు. దేశంలో నిరుద్యోగ యువత పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు కల్పించే విషయంలో ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి పి.జగన్, ఉపాధ్యక్షుడు ఆలంపల్లి జంగయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి.శంకర్, నాయకులు రాఘవేంద్ర, శివశంకర్, మహేశ్, దినేష్, కవిత, ప్రశాంత్, శివ, హఫీజ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్


