తాండూరు రూరల్: కుటుంబ కలహాలతో తల్లీ కొడుకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఐనెల్లి గ్రామ శివారులోని ఇంద్రారెడ్డి కాలనీలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. సీఐ ప్రవీణ్కుమార్ రెడ్డి కథనం ప్రకారం.. తాండూరు మండలం కోటబాసుపల్లికి చెందిన కమ్మరి శంకర్, తుల్జమ్మ(46) దంపతులు. వీరికి నరేష్(26) కొడుకు ఉన్నారు. గ్రామంలోని మైసమ్మ దేవాలయం సమీపంలో కమ్మరి వృత్తి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. నరేష్కు నాలుగేళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రం మిర్యాణ్కు చెందిన మౌనికతో వివాహమైంది. వీరికి పాప భవాని ఉంది. నరేష్ దంపతులు తరచూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో కూతురును తీసుకుని ఏడాది క్రితం మౌనిక పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ విషయమై మాట్లాడేందుకు నరేష్ తండ్రి శంకర్ పది రోజుల క్రితం మౌనికను గ్రామానికి పిలిపించి, పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించారు. అయితే మౌనికను ఎందుకు పిలిచావంటూ నరేష్, అతని తల్లి శంకర్తో గొడవపడ్డారు.
వారం రోజుల క్రితమే..
శంకర్ కుటుంబానికి ఐనెల్లి గ్రామ శివారులోని ఇంద్రారెడ్డినగర్లో ఉన్న ఓ ఇల్లు కొన్నాళ్లుగా వృథాగా ఉంది. ఇంట్లో గొడవ పడి వెళ్లిపోయిన తుల్జమ్మ, నరేష్ రెండు రోజుల పాటు ఈ ఇంట్లోనే ఉన్నారు. వారం రోజుల క్రితమే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో మంగళవారం ఓ పశువుల కాపరి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి, కరన్కోట్ ఎస్ఐ రాథోడ్ వినోద్ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తుల్జమ్మ సోదరుడు రమేష్ అక్క, అల్లుడి మృతదేహాలను గుర్తించాడు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వ హించి, బంధువులకు అప్పగించారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తుల్జమ్మ, నరేష్ను వెతికేందుకు శంకర్ తమ బంధువుల గ్రామానికి వెళ్లినట్లు సమాచారం.
కుటుంబ కలహాల నేపథ్యంలో బలవన్మరణం
తాండూరు మండలం ఐనెల్లి శివారులో ఘటన
కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు
కేసు నమోదు చేసిన పోలీసులు


