హుడాకాంప్లెక్స్: ప్రభుత్వ భూముల వేలం ఆపాలని తెలంగాణ ఉద్యమకారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కొత్తపేటలోని పాతకోర్టు స్థలం (హెచ్ఎండీఏ స్థలం) ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు శ్యాంసుందర్ గౌడ్, కార్యదర్శి కేకే, ఉపాధ్యక్షుడు జిట్టా ఆయిల్రెడ్డి, కొమ్ము అంజి, భాస్కర్, సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షుడు చామకూర రాజు, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి కేవీగౌడ్, ఉపాధ్యక్షుడు రాఘవేంద్ర ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి బాలస్వామి, హైదరాబాద్ రీజినల్ ఇన్చార్జి వరంగల్ రమేశ్, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యదర్శి వడ్డెర రఘుపతి, దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు ఎంఎస్ యాదవ్, స్పోక్స్ పర్సన్ చిత్తలూరు వేణుగౌడ్, దివ్యాంగుల విభాగం కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ తదితరులు మాట్లాడారు. ప్రభుత్వం ఒకవైపు సర్కార్ భూములను వేలం వేస్తూనే మరోవైపు ప్రజలపై అప్పుల భారం వేస్తోందని ఆరోపించారు. కొత్తపేటలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని వేలం వేయకుండా ఆ స్థలంలో మహాత్మ పూలే భవనం నిర్మించాలని, అందులో లైబ్రరీ, కాన్ఫరెన్స్ హాల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్, ఆడిటోరియం వంటివి నిర్మించి అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలను అక్కడికి తరలించాలని సూచించారు. కోర్టు స్థలం వేలం ఆపకపోతే ప్రజాసంఘాలు, అఖిలపక్ష నాయకులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాయబండి పాండురంగాచారి, మండల డానియల్, స్థానిక ఉద్యమకారులు పాల్గొన్నారు.
నిరసన వ్యక్తం చేస్తున్న నేతలు


