కత్తిగాట్లు మిగిల్చిన గాయాలే ఎక్కువ ఇష్టారీతిన సిజేరియన్లు ప్రైవేటు ఆస్పత్రుల కాసుల యావ ఆందోళన కలిగిస్తున్న ఆపరేషన్లు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పురిటి నొప్పుల భారం భరించాల్సి వస్తుందనే భయం.. శుభ ముహూర్తంలో బిడ్డకు జన్మనివ్వాలనే ఆకాంక్ష.. సహజప్రసవంతో పోలిస్తే సిజేరియన్ ద్వారా ఎక్కువఫీజు వస్తుందనే ఆస్పత్రుల ఆశ వెరసి.. అమ్మకు కడుపు కోత మిగుల్చుతున్నాయి. సహజ ప్రసవానికి అవకాశం ఉన్నా.. లేబర్ రూమ్లో ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తుందని, నొప్పుల బాధను భరించలేరని చెప్పి పలువురు వైద్యులు సిజేరియన్లను ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా జిల్లాలో సహజ ప్రసవాల కంటే సిజేరియన్లే ఎక్కువ నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
మెజారిటీ నమోదు సిజేరియన్లే..
జిల్లాలో 2024–25లో 51,362 ప్రసవాలు జరగ్గా వీటిలో 30 వేలకుపైగా సిజేరియన్లే. 2025–26లో 51,159 ప్రసవాలు నమోదైతే.. ఇందులో 35 వేలకుపైగా సిజేరియన్లే కావడం విశేషం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదవుతున్న సిజేరియన్లతో పోలిస్తే ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదవుతున్నవి కాబోయే తల్లులను తీవ్రంగా కలిచి వేస్తున్నాయి. తాము బిడ్డకు జన్మనిచ్చామనే సంతోషం కంటే వైద్యులు తమ కడుపుపై పెట్టిన కత్తిగాట్లు మిగిల్చిన గాయాలే ఎక్కువ బాధపెడుతున్నట్లు పలువురు తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఆస్పత్రికి చేరుకోక ముందే అంబులెన్సుల్లో కొంత మంది ప్రసవిస్తుంటే.. మరికొంత మంది ఇప్పటికీ ఇంట్లోనే ప్రసవిస్తున్నారు. అధిక రక్తస్రావంతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో చేరి చనిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టం
తగ్గిపోతున్న సహజ ప్రసవాలు
ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాలు ఇలా..
సంవత్సరం సహజ సిజేరియన్లు
2020–21 6,031 13,362
2021–22 5,361 13,941
2022–23 5,094 13,052
2023–24 4,706 11,815
2024–25 5,944 12,292
2025–26 6,571 14,306
నిబంధనలు మీరితే చర్యలు
ప్రసవాలపై దంపతులు, వారి తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. శుభ ముహూర్తాలు వంటి వాటిని పక్కన పెట్టి నెలలు పూర్తిగా నిండిన తర్వాతే సహజ ప్రసవం ద్వారా పిల్లలకు జన్మనివ్వాలి. సిజేరియన్లు ఎక్కువగా చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై ప్రత్యేక నిఘా పెట్టాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఆస్పత్రులపై చర్యలు తప్పవు.
– డాక్టర్ స్వర్ణకుమారి, జిల్లా వైద్యాధికారి


