మహేశ్వరం: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి మరింత వేగం తీసుకురావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. మండల పరిధిలోని తుమ్మలూరు ప్లాస్టిక్ పార్కు, శ్రీనగర్ ఈ–సీటీ పారిశ్రామిక పార్కులోని పలు పరిశ్రమలను సోమవారం ఆయన సందర్శించారు. మాన్యుఫ్యాక్షరింగ్ యూనిట్లను పరిశీలించి కంపెనీ ప్రతినిధులు, టీజీఐఐసీ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంపెనీలు ఏర్పాటు చేసి స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో టీజీఐఐసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శశాంక, శంషాబాద్ టీజీఐఐసీ జోనల్ మేనేజర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


