మంత్రి దామోదర్ రాజనర్సింహ
మల్లాపూర్: మానసిక ఎదుగుదల లోపాలతో బాధపడుతున్న చిన్నారుల విషయంలో తల్లిదండ్రులతో పాటు సమాజం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహా అన్నారు. ఆదివారం మినిస్టర్స్ క్వార్టర్స్లో సాధన ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఇంటెలెక్చువల్లీ ఛాలెంజ్డ్ (సాధన ఫౌండేషన్)కు చెందిన మానసిక దివ్యాంగ చిన్నారులు, సంస్థ ప్రతినిధులు మంత్రిని కలిశారు. మానసిక ఎదుగుదల లోపాలతో బాధపడుతున్న చిన్నారులకు నాణ్యమైన వైద్య సేవలు, ప్రత్యేక విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థలను రూపొందించే దిశగా కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో సాధన దివ్యాంగుల వ్యవస్థాపకురాలు పడమటి సురేఖారెడ్డి, కార్యదర్శి మధుసూదన్రెడ్డి తదితరులున్నారు.
పంజగుట్ట: కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను అమ్మవారికి సమర్పించేందుకు వెళ్లిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. పీర్జాదిగూడకు చెందిన నిర్మల కార్తీక్ వివాహం ఆగస్టు 16న జరగనుంది. దీంతో ఆయన తండ్రి భాస్కర్ (50) జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో వివాహ ఆహ్వాన పత్రిక సమర్పించేందుకు ద్విచక్రవాహనంపై వెళ్లారు. సోమాజిగూడలోని ప్రణవ భవనం సమీపంలో వాహనం అదుపుతప్పి కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అంబులెన్స్ ద్వారా యశోద ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తలకు తీవ్ర గాయం, రక్తస్రావం కారణంగా భాస్కర్ మృతి చెందారు. కుమారుడు కార్తీక్ ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అట్రాసిటీ కేసు నమోదు
కుషాయిగూడ: ఓ మహిళా జర్నలిస్టును అసభ్యపదజాలంతో దూషించిన వ్యక్తిపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కుషాయిగూడ పోలీసులు తెలిపిన మేరకు.. నాచారం ఇందిరానగర్ కాలనీకి చెందిన వాణి అనే జర్నలిస్టు ఈ నెల 16న కుషాయిగూడలోని మురళీకృష్ణ మిల్క్ పార్లర్లో పన్నీరు కొనుగోలు చేసింది. తాను కొనుగోలు చేసిన పన్నీరు నాసిరకంగా ఉండడంతో పార్లర్ యజమానిని ప్రశ్నించింది. దీంతో యజమాని సీసీఎస్ అధ్యక్షుడు చర్లపల్లి కాలనీల సమాఖ్య అధ్యక్షుడు ఎంపల్లి పద్మారెడ్డికి ఫోన్ చేసి మాట్లాడాలని వాణికి ఇచ్చాడు. ఫోన్ మాట్లాడిన పద్మారెడ్డి అసభ్యంగా మట్లాడాడని దళిత మహిళ అని తెలిసి కూడా దూషించడాని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు ఇన్స్పెక్టర్ భాస్కర్రెడ్డి తెలిపారు.
ఎండోక్రైన్ వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించాలి
లక్డీకాపూల్: ఎండోక్రైన్ సంబంధిత వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే జీవన నాణ్యతతో పాటు ఆయుర్దాయం కూడా మెరుగుపడుతుందని తెలంగాణ ఎండోక్రైన్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ బిపిన్ సేథి తెలిపారు. నగరంలోని హోటల్ మారిగోల్డ్లో రెండు రోజుల పాటు నిర్వహించిన తెలంగాణ ఎండోక్రైన్ సొసైటీ 7వ వార్షిక సదస్సు ఆదివారం ముగిసింది. ఎండోక్రైనాలజిస్టులు, వైద్యులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు పాల్గొన్న ఈ ముగింపు సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ వార్షిక సదస్సుల ద్వారా ఆ లోటును భర్తీ చేయాలన్నదే తమ ప్రయత్నమన్నారు.సదస్సు నిర్వహణ కార్యదర్శి, నిమ్స్ డాక్టర్ బియాట్రిస్ ఆన్ మాట్లాడుతూ.. డయాబెటిస్, ఊబకాయం, థైరాయిడ్, జీవక్రియ (మెటబాలిక్) సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వైద్యులకు నిరంతర వైద్య విద్య అత్యంత అవసరమన్నారు.


