మర్రిగూడ(చింతపల్లి): ఆర్థిక ఇబ్బందులతో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం గొడకొండ్ల గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం గిరికొత్తపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ గరీబ్ ఖాజానవాబ్ (45) చింతపల్లి మండలం గొడకొండ్ల గ్రామ పరిధిలోని వీటీ నగర్లో గల ది రెయిన్బో స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ (కరస్పాండెంట్)గా వ్యవహరిస్తున్నాడు. ఆయన గతంలో నారాయణపేట జిల్లా కోస్గిలో పాఠశాల నడిపి నష్టపోయాడు. దీంతో అప్పులు అధికం కావడం, ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పాఠశాలలోని గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రిన్సిపాల్ గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. మృతుడికి భార్య షబానా, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


