షాబాద్: తుక్కుగూడలో ఆగస్టు 2న జరిగే ఏఐటీయూసీ జిల్లా 4వ మహాసభలను విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర సమితి సభ్యుడు, జిల్లా అధ్యక్షుడు కె.రామస్వామి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ఆదివారం మహాసభలకు సంబంధించి వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చి న తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల జీతభత్యాలు పెంచక పోవడంతో బతుకులు అగమ్యగోచరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు లేక అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షాబాద్ మండలంలో నూతన పారిశ్రామిక వాడలు వస్తున్నాయని, వాటిలో స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్, గ్రాట్యుటీ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ, మండల కార్యదర్శి పాలమాకుల శ్రీశైలం, చేవెళ్ల మండల ప్రధాన కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


