కడ్తాల్: తోటి కూలీలతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి గుర్తు తెలియని దుండగులు మూడు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కెళ్లారు. మక్తమాధారం గ్రామ సమీపంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.. సీఐ సైదిరెడ్డి, బాధితురాలి కథనం ప్రకారం.. న్యామతాపూర్ గ్రామానికి చెందిన జాల మణెమ్మ తోటి మహిళా కూలీలతో కలిసి పనికోసం మక్తమాధారం వైపు వెళ్తున్నారు. ఈ సమయంలో షాద్నగర్ వైపు నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు మాస్క్ ధరించిన దుండగులు మణెమ్మ మెడలోంచి పుస్తెల తాడును లాక్కుని పరారయ్యారు. నంబర్ లేని బైక్పై వచ్చిన ముసుగు దొంగల చర్యతో మిగిలిన మహిళలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. అంతా అరుస్తుండగానే మక్తమాధారం వైపు పారిపోయారు. సమాచారం అందుకున్న సీఐ సైదిరెడ్డి పోలీసు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలితో మాట్లాడి, వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు.


