ఇబ్రహీంపట్నం: దండుమైలారంలో ఓ దొర కబంధహస్తాల్లో ఉన్న గ్రామకంఠం భూమిని దక్కించుకునేంత వరకు పోరాటం ఆపొద్దని ధర్మసమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు విశారదన్ మహారాజ్ పిలుపునిచ్చారు. గ్రామకంఠం భూమి సాధన కోసం సర్పంచ్ ఈదులకంటి నరేష్గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షను శనివారం ఆయన ప్రారంభించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదెకరాల భూమి ఎవరిదో తేలేవరకు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని అన్నారు. పది ఎకరాలు సాధిస్తే 700 మంది పేదలకు 70 గజాల చొప్పున ఇంటి స్థలం దక్కుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భూస్వామి చెరలో ఉన్న భూమిని విడిపించి, పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు టి.రాఘవేందర్, ప్రధాన కార్యదర్శి ఆర్.రాజ్కమల్, రాష్ట్ర కమిటీ సభ్యుడు తులసిగారి రవీందర్, ధర్మసమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జి,రాకేష్, పీఏసీఎస్ చైర్మన్ ఎం.అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.


