కొందుర్గు: కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండలాల్లో శుక్రవారం విజిలెన్స్ అధికారులు ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా షాపుల్లో ఉన్న డీఏపీ, కాంప్లెక్స్, యూరియా బస్తాల నిల్వలు, రైతులకు అందజేసిన బస్తాల వివరాలకు సంబందించిన బిల్లులు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ పొందుపరచాలని సూచించారు. రైతు ఆన్లైన్ నమోదు నమోదు లేకుండా ఒక్క బస్తా తేడా ఉండకూడదన్నారు. విజిలెన్స్ అధికారుల వెంట ఏఓ రాజేందర్ రెడ్డి ఉన్నారు.
శంకర్పల్లి: వారసత్వంగా వచ్చిన తమ భూమిని కొంత మంది వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితుడు విజయానంద్గుప్తా గురువారం రాత్రి మోకిల పోలీసులకు ఫిర్యాదు చేశారు. జన్వాడలోని సర్వే నంబర్ 146లో 4.13 ఎకరాల భూమిని 1991లో తమ తాతలు కొనుగోలు చేశారని, అప్పటి నుంచి తామే కబ్జాలో ఉన్నామని తెలిపారు. గురువారం రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ప్రహరీని కూల్చి, అక్రమంగా తన స్థలంలో కంటైనర్ని వేశారని తెలిపారు. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని మోకిల ఎస్ఐ సురేశ్ తెలిపారు.
చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం
చేవెళ్ల: దివంగత కొండా వెంకట రంగారెడ్డి సేవలు చిరస్మరణీయమని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం అన్నారు. శుక్రవారం కేవీ రంగారెడ్డి వర్ధంతి సందర్భంగా బీజేపీ నాయకులు మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్రను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ మల్గారి వైభవ్రెడ్డి, శ్రీశైలంయాదవ్, బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి అశోక్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, తెలుగు శ్రీనివాస్, బీజేవైఎం నాయకులు బి.చంద్రశేఖర్రెడ్డి, పురుషోత్తంరెడ్డి, గణేశ్, జయసింహారెడ్డి, అక్షయ్, రాఘవేంద్రచారి, వెంకట్, తదితరులు ఉన్నారు.
దౌల్తాబాద్: మండల కేంద్రంలోని పెద్ద చెరువులో మొసలి కలకలం రేపింది. శుక్రవారం ఉదయం పొలాలకు వెళ్తున్న రైతులకు చెరువు ఒడ్డున కనిపించింది. 15 రోజుల క్రితం ఇదే చెరువులో మొదటి సారి కంటపడింది. గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. త్వరలో మొసలిని పట్టుకుంటామని, అప్పటి వరకు ఎవరూ చెరువు పరిసరాల్లోకి.. చేపల వేటకు వెళ్లరాదని ఫారెస్టు అధికారులు సూచించారు.


