ఇబ్రహీంపట్నం: అనుమానాస్పదస్థితిలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. సీఐ మహేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఆర్టీసీ డిపో సమీపంలో గురువారం తెల్లవారుజామున ఓ వృద్ధుడి (సుమారు 70 ఏళ్లు) మృతదేహం పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడిని మంచాల మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన పూర్యా నాయక్గా గుర్తించారు. అక్కడున్న సీసీ పుటేజీలను పరిశీలించగా వృద్ధుడిని ఓ యువకుడు కాళ్లతో తంతున్నట్లు నమోదైంది. ఆ యువకుడి కారణంగానే వృద్ధుడు మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
చేవెళ్ల డివిజన్ డీఎల్పీఓ సతీశ్రెడ్డి
షాబాద్: ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నీటిని పొదుగా వాడుకోవాలని చేవెళ్ల డివిజన్ డీఎల్పీఓ సతీశ్రెడ్డి అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బందితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత ఉండేవిధంగా చూసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పని దినాలను 125కు పెంచినట్లు గుర్తుచేశారు. తక్కువ నీటితో సాగయ్య పంటలను మాత్రమే సాగు చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై చర్యలు తీసుకోవాలని కార్యదర్శులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అపర్ణ, వ్యవసాయశాఖ అధికారి దండెం విజయంద్ర, ఎంపీఓ నర్సయ్య, ఏపీఓ వీరాసింగ్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.


