యాచారం: కూలీ పనికి వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కందుకూరు మండల పరిధిలోని ఉట్లపల్లి గ్రామానికి చెందిన వి.శివాజీ ఈ నెల 15న ఇంట్లో నుంచి కడ్తాల్కు సెంట్రింగ్ పనికి వెళ్తున్నానని, వాళ్ల అమ్మ సువర్ణకు చెప్పి వెళ్లాడు. నాలుగు రోజులైన ఇంటికి తిరిగి రాకపోవడం, వివిధ గ్రామాల్లో బంధువులు, స్నేహితుల వద్ద ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆరా తీసిన జాడలేదు. దీంతో బుధవారం గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.
● విద్యార్థినిని చితకబాదిన ఉపాధ్యాయుడు
● వెంకటాపూర్ ఉన్నత
పాఠశాలలో ఘటన
మొయినాబాద్: హోంవర్క్ చేయలేదనే కారణంతో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినిని చితకబాదాడు. ఈ సంఘటన మొయినాబాద్ మండలం వెంకటాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగింది. హిందీ పండిత్గా పనిచేస్తున్న ప్రవీణ్కుమార్ దాడిలో 7వ తరగతి బాలిక చేతులు కమిలిపోయాయి. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడిని నిలదీయగా, వారిపై ఎదురుదాడికి దిగాడు. సదరు టీచర్ గతేడాది ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో షీటీం పోలీసులకు ఫిర్యాదు చేయగా కౌన్సెలింగ్ ఇచ్చారు. అప్పట్లో ఇతని వ్యవహారంపై డీఈఓకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మరో బాలికను చితకబాది వివాదంలో చిక్కుకున్నారు. ఇతని తీరుతో కొందరు విద్యార్థులు పాఠశాలకు రావడానికే భయపడుతున్నారని, స్కూల్కు మానేస్తున్నారని సమాచారం.


