యాచారం: మొండిగౌరెల్లి గ్రామంలో అసైన్డ్ సర్వేనంబర్ 127లోని కబ్జా రైతుల పేర్లతో కూడిన మొదటి జాబితాను ఆదివారం రెవెన్యూ అధికారులు ప్రకటించారు. ఈ సర్వే నంబర్లో మొత్తం 122.02 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. అందులో 108 ఎకరాలకే అసైన్డ్ చేశారు. 77 మంది రైతులు 95.12 ఎకరాల్లో అసైన్డ్ పట్టాలు కలిగి ఉన్నారని, అందులో 70.09 ఎకరాల్లోనే సాగులో ఉన్నట్లు గుర్తించారు. 26.30 ఎకరాల అసైన్డ్ భూమి వివాదంతో పాటు కొంతమంది రైతులు పట్టాలు కలిగి ఉంటే, అదే భూమిలో మరొకరు కబ్జాలో ఉన్నట్లు నిర్ధారించారు. మరికొందరి రైతుల పేర్ల మీద పట్టాలు కాలేదని ప్రకటించారు. ఏ సమస్య లేని 77 మంది రైతులకు చెందిన 70.09 ఎకరాలకు ముందస్తుగా రెండు, మూడు రోజుల్లో అవార్డు ప్రకటించి ఎకరాకు రూ.30 లక్షల చొప్పున పరిహారం చెక్కులు అందజేయడానికి సిద్ధమవుతున్నారు. కాగా, పట్టాదారు పాసుపుస్తకాల్లో కంటే తక్కువగా ఎకరాలను జాబితాలో ప్రకటించిన రైతులు రీ సర్వే చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


