శంకర్పల్లి: అతివేగం, అజాగ్రత్తగా వెళ్తున్న ఓ వాటర్ ట్యాంకర్(లారీ) యూటర్న్ చేస్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడిని బలంగా ఢీ కొట్టింది. తర్వాత అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న మామిడి చెట్టుని ఢీకొట్టి ఆగడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన మండలంలోని కొల్లూరు గేటు వద్ద చోటు చేసుకుంది. మోకిల ఎస్ఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. జన్వాడకి చెందిన వడ్ల బ్రహ్మాచారి(45) ఆదివారం మధ్యాహ్నం వ్యక్తిగత పనుల నిమిత్తం తన ద్విచక్రవాహనంపై నగరం వైపు వెళ్తున్నాడు. అయితే కొల్లూరు గేటు వద్ద యూటర్న్ తీసుకుంటుండగా.. శంకర్పల్లి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న వాటర్ ట్యాంకర్ అతివేగం, అజాగ్రత్తగా వచ్చి బైక్ని బలంగా ఢీ కొట్టి కొద్దిదూరం లాక్కెళ్లింది. తర్వాత అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న మామిడి చెట్టుని ఢీకొట్టి ఆగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్యాంకర్ కింద ఉన్న బ్రహ్మాచారిని బయటకు తీసి, అంబులెన్సులో నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తర్వాత మూడు క్రేన్ల సాయంతో వాటర్ ట్యాంకర్ని పక్కకు తీశారు. ప్రమాదం జరగ్గానే ట్యాంకర్ డ్రైవర్ పరారీ అయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఒకరికి తీవ్ర గాయాలు


