యాచారం: మండలంలోని మొండిగౌరెల్లిలో చేపట్టే భూసేకరణకు ఒకే దఫా అర్హుల జాబితాతో కూడిన అవార్డుల ప్రకటన జారీ చేయాలని అసైన్డ్ రైతులు తేల్చి చెప్పారు. శనివారం 19, 68, 127 సర్వే నంబర్లల్లో అసైన్డ్ భూమి సేకరణపై ఇబ్రహీంపట్నం ఆర్డీఓ శ్రీనివాస్రెడ్డి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సర్పంచ్ కోలన్ రమాదేవి అధ్యక్షతన రైతులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఏళ్లుగా కబ్జాలో ఉండి సాగు చేసుకుని జీవనోపాధి పొందుతున్న తమకు పరిహారం అందజేయాలన్నారు. భూసేకరణ చేసే రైతులకు ఏ సర్వే నంబరులో ఎకరాకు 121 గజాల చొప్పున ప్లాట్లు ఇస్తారో తెలపాలన్నారు. నకిలీలను గుర్తించి వారి పేర్లను కూడా ప్రకటించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను కోరారు. అనంతరం ఆర్డీఓ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. అసైన్డ్ భూసేకరణ వేగవంతం చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని, అందుకు రైతులు సహకరించాలని కోరారు. అసైన్డ్ భూములను భవ్యస్కీం కింద అప్పగించడానికి సర్కార్ నిర్ణయించినట్లు తెలిపారు. కబ్జా రైతులకు పరిహారం చెల్లింపులపై ఉన్నతాధికారుల పరిధిలో ఉంటుందన్నారు. నిజమైన రైతులకు న్యాయం చేస్తామని, ఆందోళన అవసరమే లేదన్నారు. విడతల వారీగా అవార్డుల ప్రకటిస్తామని తెలిపారు. ఒకేసారి జారీ చేయడం సాధ్యం కాదన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అయ్యప్ప, ఉప సర్పంచ్ బడే కుమార్, వార్డు సభ్యులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం ఆర్డీఓ శ్రీనివాస్రెడ్డి


