మంచాల: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన ఏఎన్ఎం ఎం.జంగమ్మకు అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి అవార్డు ప్రదానం చేశారు. శనివారం జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రపంచ జనాభా దినోత్సవంలో కుటుంబ నియంత్రణ, లింగసమానత్వం, సుస్థిరాభివృద్ధిపై అవగాహన కల్పిస్తూ ఉత్తమ సేవలు అందించిన ఏన్ఎంలు, ఆశవర్కర్లకు అవార్డులు, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ఆరుట్ల పీహెచ్ఎస్ పరిధి బోడకొండ, ఎల్లమ్మ తండా గ్రామాల్లో ఏఎన్ఎంగా విధులు నిర్వర్తించిన ఎం.జంగమ్మ ఉత్తమ అవార్డు అందుకున్నారు. ఈ మేరకు ఆమెకు జ్ఞాపిక అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జంగమ్మ మాట్లాడుతూ.. 24 ఏళ్లుగా కాంట్రాక్ట్ ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్నానని ప్రభుత్వం ఇప్పటికై నా తమ సేవలను గుర్తించి రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ స్వర్ణకుమారి, అధికారులు షీబాహయత్, డాక్టర్ రాధిక, పాపారావు, రాకేశ్, జ్యోతిబాయి, మంజుల, శ్రీనివాస్, డాక్టర్ పల్లవి, సూపర్వైజర్ రజిత తదితరులు పాల్గొన్నారు.
అదనపు జిల్లా సెషన్స్ జడ్జి స్వాతిరెడ్డి
షాద్నగర్: రాజీ మార్గమే రాజమార్గమని అదనపు జిల్లా సెషన్స్ జడ్జి స్వాతిరెడ్డి అన్నారు. పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక లోక్అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎనిమిది చెక్ బౌన్స్ కేసులను పరిష్కరించారు. అనంతరం జడ్జి స్వాతిరెడ్డి మాట్లాడుతూ.. చిన్న చిన్న విషయాలకు, కొట్లాటలకు ప్రజలు ఠాణాలు, కోర్టుల చుట్టూ తిరుగుతూ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ జడ్జి కొత్త రవి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి మాల్యాల సాహితి, న్యాయవాదులు పాల్గొన్నారు.
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పార్లమెంట్ అధ్యక్షుడు ప్రకాశ్
మంచాల: దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పార్లమెంట్ అధ్యక్షుడు డి.ప్రకాశ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని మానసిక దివ్యాంగుల సంరక్షణ కేంద్రంలో నిర్వహించిన తల్లిదండ్రుల అవగాహన సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివ్యాంగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. సమాజంలోని బలహీన వర్గాలకు, దివ్యాంగులకు అండగా నిలవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు లత, ఐకేపీ సీసీ లాల్ సింగ్, సిబ్బంది సురక్షిత, కవిత, సంతోష తదితరులు పాల్గొన్నారు.
ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి
మహేశ్వరం: మండల పరిధిలోని రావిర్యాల ఫ్యాబ్సిటీలో భూములు కోల్పోయిన రైతులకు కందుకూరు మండలం లేమూర్లో హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం తయారు చేసిన ప్లాట్లు ఇవ్వడానికి టీజీఐఐసీ అంగీకరించిందని కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టీజీఐఐసీ ఎండీ ఆదేశాల మేరకు శంషాబాద్ జోనల్ మేనేజర్ ఆర్డీఓ కార్యాలయానికి లేఖ రాశారని చెప్పారు. రైతులు ఆందోళన చెందొద్దని సూచించారు.


