శంకర్పల్లి: రైతులకు సరైన నష్ట పరిహారం ఇవ్వకుండా భూములు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధపడడం బాధాకరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్ గౌడ్ అన్నారు. శనివారం బహదూర్గూడ వద్ద రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా.. ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి శంకర్పల్లి ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా రాజ్భూపాల్గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి రైతులకు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఎకరాకు 1,500 గజాల భూమి లేదా మరో చోట అంతే మొత్తంలో కోల్పోయిన భూమిని కేటాయించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు శంకర్పల్లి ఠాణాకి రావడంతో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, శంకర్పల్లి పట్టణాధ్యక్షుడు దయాకర్రెడ్డి, నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మద్దతు తెలిపారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్


