కొత్తూరు: అరెస్టులు, కేసులకు భయపడకుండా లగచర్ల పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఎంపీ డీకే అరుణ సూచించారు. డంప్యార్డును వ్యతిరేకిస్తూ సిద్ధాపూర్లో గురువారం నిర్వహించిన సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైలు, రోడ్డు, విమానమార్గాలకు అనువుగా ఉన్న సిద్ధాపూర్లో ఐటీ, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేయాలేతప్ప డంప్యార్డు కాదన్నారు. ప్రభుత్వం ఈ విషయమై మరోసారి ఆలోచించాలని కోరారు. లేని పక్షంలో లగచర్ల తరహా పోరాటాలకు సిద్ధమవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటికై నా పార్టీలకు అతీతంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చొరవ తీసుకోవాలన్నారు. ఆయన వెంట తాము సీఎంను కలిసి సమస్యలు వివరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఐక్య కార్యచరణ కమిటీ ఏర్పాటు చేసి జీవో 641 రద్దు చేసే వరకు ఆందోళనలు చేపట్టాలని, తమ పూర్తి మద్దుతు ఉంటుందని ఎంపీ ప్రకటించారు. కార్యక్రమంలో నాయకులు అందె బాబయ్య, శ్రీవర్థన్రెడ్డి, ఎమ్మె సత్యనారాయణ, అంబటి ప్రభాకర్, ఎల్లారం శేఖర్రెడ్డి, బాలయ్య, శ్రీనివాస్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి పాల్గొన్నారు.
హక్కులను కాలరాయడమే..
సిద్ధాపూర్లో డంప్యార్డు ఏర్పాటు చేయడం ప్రజల హక్కులను కాలరాయడమేనని పౌరహక్కుల సంఘం నేతలు విమర్శించారు. పంటలు పండని, ఎవరికీ ఇబ్బంది లేనిచోట ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు, రైతులకు నష్టం చేసే విధంగా ఉన్న జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల తరఫున తాము కోర్టులు, ఇతర మార్గాల్లో డంప్యార్డు ఏర్పాటును అడ్డుకోవడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం నేతలు నారాయణరావు, తిరుమలయ్య, మిట్టునాయక్, రాంబాల్నాయక్, తదితరులు పాల్గొన్నారు.


