షాబాద్: పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ జేడీ శ్రీనివాసరావు రైతులకు సూచించారు. మండల పరిధిలోని కుమ్మరిగూడను గురువారం సందర్శించిన ఆయన పాడి పశువులు, పాకలు, పశుగ్రాసాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో పాలకు మరింత డిమాండ్ పెరుగుతుందని, పాడి పరిశ్రమను వదలొద్దని రైతులకు సూచించారు. సబ్సిడీపై దాణా ఇచ్చే విషయమై ఉన్నతాధికారులకు లేఖ రాస్తానని చెప్పారు. వర్షాకాలంలో పశువులకు వచ్చే రోగాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన షాబాద్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు పట్టిక, మందుల స్టాకు రిజిస్టర్ను పరిశీలించారు.


