నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
● ఐదు రోజుల పాటువేంకటేశ్వరస్వామి ఉత్సవాలు
● ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు
ఆమనగల్లు: పట్టణంలో వెలసిన శ్రీ వేంకటగిరి వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 23 నుంచి 27 వరకు 126వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల కోసం ఆలయ ధర్మకర్త గూడ కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏడాది పాల్గుణమాసం షష్టి నుంచి ఏకాదశి వరకు 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆమనగల్లు మండలంతో పాటు సమీప మండలాల నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారు. ఉత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం గాన కై ంకర్యదాసులు శ్రీ వేంకటాచలపతిచే అన్నమయ్య గాన విభావరి నిర్వహించనున్నారు.
కార్యక్రమాల వివరాలు
ఈనెల 23న సాయంత్రం పుణ్యహావాచనం, విశ్వక్సేన ఆరాధనం, అంకురార్పణ, దేవతాహ్వానంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 24న స్వామి వారికి మహాభిషేకం, ప్రత్యేక పూజలు, అగ్నిప్రతిష్ఠ, హోమం, ధ్వజారోహణం, ఎదుర్కోలు, 25న ఉదయం సుప్రభాత సేవ, ప్రత్యేక పూజలు, ఉదయం 11 గంటలకు శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం, 26న మహాభిషేకం, సుప్రభాతసేవ, ఉదయం 6 గంటలకు రథోత్సవం, 10 గంటలకు సుదర్శన హోమం, దోపోత్సవం, 27న మహాభిషేకం, సుప్రభాత సేవ, అర్చనలు, పూర్ణాహుతి, చక్రతీర్థంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఐదు రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ధర్మకర్త కోరారు.


