రంజాన్ మాసం.. పారిశుద్ధ్య లోపం
పహాడీషరీఫ్: పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని జీహెచ్ఎంసీ జల్పల్లి సర్కిల్లోని ముస్లిం బస్తీలలో పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపట్టకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్తా చెదారాలను అటుంచితే ఏకంగా ఇతర ప్రాంతాల నుంచి ఊర పందులను తీసుకొచ్చి తమ బస్తీలలో వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వాదే హదీస్ బస్తీకి వెళ్లే దారిలోని ఫిరంగి నాలా పరిసరాలలో పెద్ద ఎత్తున చెత్తా చెదారాలు పడేసి నిప్పంటించడం.. ఆపై పందులను కూడా ఆ ప్రాంతంలో వదిలేయడం పట్ల స్థానికులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఈ విషయమై ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఖాలేద్ బస్తీ వాసులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుంటే.. ఇక్కడ మాత్రం ఇతర ప్రాంతాల నుంచి చెత్తను తెచ్చి పారబోస్తున్నారని వాపోయారు. ఫిరంగి నాలాలో చెత్తా చెదారాలు పడకుండా బస్తీ వాసులు చందాలు వేసుకొని ఇనుప కంచె ఏర్పాటు చేసుకుంటే, దానిని కూడా అధికారులే కత్తరించి చెత్తను డంప్ చేస్తున్నారన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు 50కి పైగా పందులను ఫిరంగి నాలాలో వదిలారని, ఈ విషయమై అధికారులను సంప్రదిస్తే వాటిని అందులోనే వేసి మట్టి పోసి చంపేస్తామని సమాధానాలు ఇస్తున్నారని ఆరోపించారు. సర్కిల్ డీఈ(ఎస్డబ్ల్యూఎం) ఇష్రత్ ఆయేషా, శానిటేషన్ ఇన్స్పెక్టర్ మోయిన్ బాబాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు పట్టించుకొని ప్రజలు విష జ్వరాల బారిన పడకుండా వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరారు.
జల్పల్లి అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం


