సిరిసిల్ల: జిల్లాలో అంగన్వాడీ టీచర్ల భర్తీ ప్రక్రియ వేగంగా సాగుతోంది. సిరిసిల్ల, వేములవాడ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 55 టీచర్ పోస్టుల భర్తీకి 1475 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. ఇక అభ్యర్థుల స్థానికత, కులం, నివాసాన్ని నిర్ధారించేందుకు క్షేత్రస్థాయికి వెళ్లనున్నారు. విచారణ అనంతరం అభ్యర్థుల అర్హత జాబితాను వెల్లడించనున్నారు.
అభ్యర్థుల్లో ఉత్కంఠ
ఇంటర్ విద్యార్హతతో టీచర్ల ఎంపిక సాగుతుండగా.. కొత్తతరం అభ్యర్థుల మార్కులు సహజంగానే ఎక్కువగా ఉన్నాయి. దశాబ్దాల కిందట ఇంటర్ పూర్తి చేసిన వారి మార్కులు తక్కువగా ఉంటాయి. దీంతో ఇంటర్ మార్కులను ప్రామాణికంగా తీసుకుంటే సీనియర్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. మెరిట్ విధానంపై గతంలో అంతర్గతంగా పరీక్షలు నిర్వహించేవారు. ఈసారి అలాంటి మెరిట్ పరీక్ష లేకపోవడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. కలెక్టర్ పర్యవేక్షణలో ఎంపిక కమిటీ కేటాయించే 10 మార్కులే కీలకంగా మారుతాయని అభ్యర్థులు భావిస్తున్నారు.
వడబోత షురూ..
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి కాగా.. క్షేత్రస్థాయి పరిశీలనతో స్థానికేతరులను తొలగించనున్నారు. పల్లెల్లో గ్రామం యూనిట్గా, పట్టణాల్లో వార్డు యూనిట్గా పరిశీలించనున్నారు. ఇప్పటికే 55 అంగన్వాడీ పోస్టులకు సామాజికవర్గాల రిజర్వేషన్లు ప్రకటించడంతో దరఖాస్తుల సంఖ్య తగ్గింది. సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ టీచర్ పోస్టుకు జిల్లాలోనే అత్యధికంగా 150 దరఖాస్తులు రాగా.. ఇల్లంతకుంట మండలం గాలిపల్లి, సిరిసిల్ల అంబేడ్కర్నగర్లో ఒక్కో దరఖాస్తు మాత్రమే వచ్చాయి. తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట, రుద్రంగి మండలం మానాలలో రెండు చొప్పున దరఖాస్తులు వచ్చాయి. వేములవాడ ప్రాజెక్టు పరిధిలో తిప్పాపూర్–2కు అత్యధికంగా 78 దరఖాస్తులు వచ్చాయి.
అంగన్వాడీ టీచర్ పోస్టులు.. వచ్చిన దరఖాస్తులు
నియోజకవర్గం మండలాలు పోస్టులు దరఖాస్తులు
సిరిసిల్ల 06 35 1,019 వేములవాడ 04 09 279 చొప్పదండి 01 03 71
మానకొండూర్ 01 08 106


