వేములవాడ అర్బన్: రాజన్న గుడిచెరువు కట్ట, తిప్పాపూర్లలోని గోశాలలను ఆలయ ఈవో రమాదేవి శనివారం పరిశీలించారు. గోవులకు అందిస్తున్న గడ్డి, దాణా, తాగునీరు, వైద్యసేవలు పరిశీలించారు. గోవుల ఆరోగ్య సంరక్షణలో నిర్లక్ష్యం చేయొద్దని అధికారులకు సూచించారు. ఈవో రమాదేవి మాట్లాడుతూ దేవస్థానానికి భ క్తులు సమర్పించే కోడెలు, గోవులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. దేవస్థానం పరిధిలోని టీటీడీ ఎంక్వయిరీ(వసతి బుకింగ్) ఆఫీస్, భారత్ గ్యాస్ గోదాంను ఈవో తనిఖీ చేశారు. రిజిస్టర్లు, రసీదులు పరిశీలించారు. ఈఈ రాజేశ్, ఏఈవో మహేశ్, పర్యవేక్షకులు అరుణ్ ఉన్నారు.
వాణిజ్య పంటలతో లాభాలు
బోయినపల్లి(చొప్పదండి): వాణిజ్య పంటల సాగుతో రైతులు అధిక దిగుబడులు సాధించడంతోపాటు మెరుగైన లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యానశాఖ అధికారి శరత్కుమార్ పేర్కొన్నారు. మండలంలోని రత్నంపేట, రామన్నపేట, మర్లపేట, దేశాయిపల్లి గ్రామాల్లో రైతులు సాగుచేస్తున్న వాణిజ్య పంటలను ఎంఏవో ప్రణితతో కలిసి శనివారం పరిశీలించారు. వాణిజ్య పంటలకు మార్కెట్లో డిమాండ్ ఉందన్నారు.
ఉపాధి పనులు పరిశీలన
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని దేశాయిపల్లి, తంగళ్లపల్లి గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి హామీ, వ్యవసాయ అభివృద్ధి పనులను శనివారం డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం పరిశీలించారు. దేశాయిపల్లిలో ఫామ్పాండ్ పనులను పరిశీలించి, అత్యవసర సమయంలో ఈ నీరు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం తంగళ్లపల్లి గ్రామాన్ని సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన బోరుబావి రీచార్జ్ పిట్ పనులను తనిఖీ చేశారు. ఎంపీడీవో రమేశ్, ఏపీడీ నర్సింహులు, ఏపీవో రాజనర్సు, సర్పంచులు అంచ శ్రీనివాస్రెడ్డి, మోర లక్ష్మీరాజం, పంచాయతీ కార్యదర్శులు సంతోష్, సలీమ్ పాల్గొన్నారు.
వడగండ్ల బాధితులకు పరిహారం అందించాలి
కోనరావుపేట(వేములవాడ): రెండేళ్లుగా కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో శనివారం రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ మండలాధ్యక్షుడు మిర్యాల్కార్ బాలాజీ మాట్లాడుతూ గత రెండేళ్లుగా కురిసిన వడగండ్ల వానలకు మరిమడ్ల, శివంగాలపల్లి, వెంకట్రావుపేట, వట్టిమల్ల గ్రామాల్లోని పంటలకు తీవ్రంగా నష్టం జరిగిందన్నారు. బాధిత రైతులకు పరిహారం మంజూరు చేయాలని కోరారు. బైరగోని సురేశ్, ఎక్కల్దేవి జలంధర్, ఎడ్ల సుధాకర్, చింతల పర్శరాములు, చీకటి మధు, తీగల జయశ్రీ, రవీందర్గౌడ్, చౌటపెల్లి వెంకన్న, సుదగోని సాయికృష్ణ పాల్గొన్నారు.


