● మొగులుతో గుబులు ● నెల రోజులుగా పడిగాపులు ● పట్టించుకోని అధికారులు ● తూకం వేయక ఆందోళనలో అన్నదాతలు
సిరిసిల్ల అర్బన్: పంట పండించేందుకు ఎంత కష్టపడుతున్నారో అన్నదాతలు ధాన్యాన్ని విక్రయించుకునేందుకు అంతకుమించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటను కోసి కొనుగోలు కేంద్రాలకు తరలించి ఇరువై రోజులు గడుస్తున్నా తూకం వేయకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. వాతావరణంలో కలుగుతున్న మార్పులతో రైతుల పడుతున్న ఆందోళన చెప్పలేనిదిగా ఉంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి నెల రోజులు గడుస్తున్నా తూకం వేయకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తూకం వేసే సమయంలో అకాల వర్షాలు, వడగండ్ల వానలతో ఎండిన పంటలు తడిసి ముద్దవుతున్నాయి. చేసేదేమి లేక మళ్లీ ఆరబోయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.
15 రోజులుగా కేంద్రాల్లోనే..
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దబోనాల కొనుగోలు కేంద్రం పరిధిలోని మార్కెట్పల్లిలో ధాన్యం పోసుకొమ్మని మెప్మా అధికారులు చెప్పారు. దీంతో 70 మంది రైతులు ధాన్యం కుప్పలు పోశారు. 15 రోజుల క్రితం కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ తూకం వేయడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రంలో ఎక్కడి కుప్పలు అక్కడే పేరుకుపోయాయి. ఇప్పటికే తేమశాతం తగ్గి నష్టపోతున్నామని, వర్షాలు కురిస్తే ధాన్యం తడిసి రంగు మారి, మొలకలు వచ్చి నష్టపోవాల్సి వస్తుందేమోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


