సిరిసిల్ల: జిల్లాలో రెవెన్యూ శాఖ భారీ కుదుపునకు గురైంది. ఖాళీగా ఉన్న జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో)గా గ్రేటర్ హైదరాబాద్లో పనిచేస్తున్న వి.రమాదేవిని నియమించారు. సిరిసిల్ల ఆర్డీవోగా పనిచేస్తున్న సీ.హెచ్.వెంకటేశ్వర్లు జనగామ ఆర్డీవోగా బదిలీ కాగా.. ఆయన స్థానంలో డిప్యూటేషన్పై తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీలో పనిచేస్తున్న ఎన్.రాజేందర్రెడ్డి(డిప్యూటీ కలెక్టర్)ని నియమించారు. వేములవాడ ఆర్డీవోగా డిప్యూటేషన్పై తెలంగాణ రాష్ట్ర వేర్హౌసింగ్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కే.ఎస్.బి.కుమారిని నియమించారు. వేములవాడ ఆర్డీవో రాధాభాయి భూసేకరణ విభాగం ప్రత్యేక కలెక్టర్గా పనిచేయనున్నారు.
విధుల్లో చేరిన డీఎఫ్వో
సిరిసిల్ల: జిల్లా ఫారెస్ట్ అధికారిగా ఎస్.సత్యనారాయణ మంగళవారం విధుల్లో చేరారు. ఇప్పటి వరకు డీఎఫ్వోగా ఉన్న బాలమణి కుమురంభీం ఆసిఫాబాద్ డీఎఫ్వోగా బదిలీ కాగా.. ఆమె స్థానంలో డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారిగా సత్యనారాయణను నియమించారు. సిరిసిల్లలో బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణకు ఫారెస్ట్ రేంజ్ అధికారి కల్ప నాదేవి మొక్కను అందించి స్వాగతం పలికారు.
● టీటీడీ చైర్మన్తో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ.5కోట్లు మంజూరు చేయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో ఫోన్లో కోరారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో ఆలయ కమిటీ మంగళవారం హైదరాబాద్లో కేటీఆర్ను కలిసి నిధుల విడుదల కోసం విన్నవించింది. ఈమేరకు కేటీఆర్ టీటీడీ చైర్మన్తోపాటు మంత్రి లోకేశ్తో ఫోన్లో మాట్లాడారు. ఎల్లారెడ్డిపేట ఆలయానికి రూ.5 కోట్లు, సిరిసిల్ల ఆలయానికి రూ.7 కోట్లు మంజూరు చేయించాలని కోరారు. ఆలయ నిర్మాణ నమూనాతోపాటు గతంలో మంజూరు ఇచ్చిన పత్రాలను చైర్మన్ బీఆర్ నాయుడుకి మెయిల్ పంపించారు. సర్పంచ్ ఎలగందుల నరసింహులు, ఆలయ కమిటీ చైర్మన్ గుండం సుధాకర్రెడ్డి, వైస్చైర్మన్, రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు మీసం రాజం, నేవూరి వెంకట నరసింహారెడ్డి, ఎడ్ల సందీప్ ఉన్నారు.
సిరిసిల్లటౌన్: కేంద్ర సహాయ హోంశాఖ మంత్రి బండి సంజ య్కుమార్ బుధవారం జిల్లాలో పర్యటిస్తారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి తెలిపారు. ఉదయం 9:30 గంటలకు పట్టణంలోని కార్గిల్లేక్ సుందరీకరణకు భూమిపూజ చేస్తారు. ఉదయం 10:30 గంటలకు సినారె కళామందిరంలో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ చేస్తారు. ఉదయం 11:30 గంటలకు వాసవి కల్యాణ మండపంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.
గ్రామీణ మహిళలకు త్రోబాల్లో శిక్షణ
సిరిసిల్ల అర్బన్: గ్రామీణ మహిళల కోసం జిల్లాలో ఇషా త్రోబాల్ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఇషా గ్రామోత్సవం నిర్వాహకులు వంగ అనిల్ తెలిపారు. ఖమ్మం, సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పల్లెప్రకృతి వనంలో ఈనెల 13 నుంచి 17 వరకు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పాల్గొనే వారికి రూ.5లక్షల వరకు నగదు బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు 96664 44843లో సంప్రదించాలని కోరారు.


