ఎల్లారెడ్డిపేట( సిరిసిల్ల): ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మద్దతు ధర ఇస్తారనే ఆశతో కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే మిల్లర్లు తూకంలో దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఆదివారం మండలంలోని పదిర గ్రామానికి చెందిన అన్నదాతలు సిరిసిల్ల– కామారెడ్డి రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ, తాము పండించిన ధాన్యాన్ని 15రోజుల క్రితం కేంద్రానికి తీసుకువస్తే, నిర్వాహకులు 40 కిలోలకు బదులు 42.500 కిలోలు తూకం వేస్తున్నారని ఆరోపించారు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని పేర్కొన్నారు. తూకంలో రెండున్నర కిలోల మోసం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఆందోళన చేస్తున్న రైతులకు బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సై రాహుల్రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని ఆందోళన విరమించాలని కోరగా, రైతులు, నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధికారులతో మాట్లాడుతామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి మద్దుల బుగ్గారెడ్డి, మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి, నాయకులు సల్ల సత్యంరెడ్డి, కంచర్ల పరుశరాములు, వినయ్, రైతులు పాల్గొన్నారు.


