సిరిసిల్లటౌన్: పవర్లూమ్స్, వైపని కార్మికుల కూలి పోరాటం ఫలించింది. గురువారం యజమానులతో జరిగిన చర్చలు ఫలించాయి. గురువారం పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘంలో యజమానులు, పవర్లూమ్ వార్పిన్, వైపని కార్మికుల కూలిపై చర్చలు జరిపారు. అనంతరం పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ మాట్లాడుతూ, పవర్లూమ్, వైపని కార్మికుల కూలి పెంపు అగ్రిమెంట్ జరిగిందని, వార్పిన్ కార్మికుల కూలి సమస్య పరిష్కారం కాలేదన్నారు. పవర్లూమ్ కార్మికులకు చిన్న పన్నకు 28 పైసలు, పెద్దపన్నకు 29 పైసలు ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగిందన్నారు. వైపని కార్మికులకు పాలిస్టర్ వెయ్యి పోగులకు రూ.100 ఇవ్వడానికి అంగీకారం కుదిరిందన్నారు. ఇట్టి కూలి మే 1 నుంచి అమలుకు యజమానులు సమ్మతించారని పేర్కొన్నారు. వార్పిన్ కార్మికుల కూలి అగ్రిమెంటు జరగని నేపథ్యంలో వారి సమ్మె యథాతథంగా కొనసాగిస్తామన్నారు. యజమానుల సంఘం అధ్యక్షుడు ఆడెపు భాస్కర్, కార్యదర్శి ఆంకారపు రవి, గోవింద్ రవి, దూడం శంకర్, దూస భూమయ్య, బండారి అశోక్, మండల బాలరాజ్, శ్రీరామ్ సత్యం, కోడం రమణ, సిరిమల్లె సత్యం, ఉడుత రవి, మచ్చ వేణు, ఒగ్గు గణేశ్, ఎలిగేటి శ్రీనివాస్, కుసుమ గణేశ్ తదితరులు పాల్గొన్నారు.


