అందని రైతు భరోసా
యాసంగి నాట్లు పూర్తయినా అందని పంట సాయం సాగు వివరాలు అందించిన వ్యవసాయశాఖ జిల్లాలో 1,26,278 మంది లబ్ధిదారులు
సిరిసిల్ల: పంటల పెట్టుబడి సాయం రైతుభరోసా యాసంగి(రబీ) సీజన్ మొదలై రెండు నెలలు గడుస్తున్నా అందడం లేదు. ప్రభుత్వం ఎకరానికి రూ.6వేలు చొప్పున రైతులకు పెట్టుబడి సాయంగా అందజేస్తుంది. అయితే ఈ సీజన్లో మాత్రం పెట్టుబడికి డబ్బులు లేక రైతులు అప్పు చేసి పంటలు సాగు చేశారు. మున్సిపల్ ఎన్నికలు ముగియగానే రైతుల బ్యాంకు ఖాతాల్లో ‘రైతుభరోసా’ డబ్బులను జమచేస్తామని ప్రభుత్వం ప్రకటించినా సాయం మాత్రం అందలేదు. అప్పోసప్పో చేసి వరినాట్లు పూర్తి చేసిన రైతులు.. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
జిల్లాలో పంటల సాగు ఇలా..
జిల్లాలో యాసంగి సీజన్లో వరి 1,83,850 ఎకరాలు, మక్క 2,135, నువ్వులు 490, పొద్దుతిరుగుడు 1,107, కందులు 375, పెసర 81, వేరుసెనగ 35 ఎకరాల్లో సాగుచేశారు. రైతులు ఎరువుల కొనుగోలు, విత్తనాల కొనుగోళ్లు, ట్రాక్టర్తో దున్నకాలకు, వ్యవసాయ కూలీల కై కిళ్లు ఇలా ఎకరానికి సగటున రూ.15వేల వరకు ఖర్చు పెట్టారు.
శాటిలైట్ సర్వే ఆధారంగా..
సాగులో ఉన్న భూములకే రైతుభరోసా ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సాటిలైట్ సర్వే చేసింది. సర్వేనంబర్ల వారీగా రైతుల వివరాలను నమోదు చేస్తూ.. అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా శాటిలైట్ సర్వే పూర్తి చేశారు. సాగుచేసిన భూముల వివరాలను వ్యవసాయశాఖ ఆన్లైన్లో నమోదు చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగుచేయని, పడావు పడ్డ, బీడు భూములకు కూడా రైతుబంధు సాయం ఇచ్చి.. ప్రజాధనం వృథా చేసిందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంటూ ఈ సర్వేలు చేయించారు. రబీ సీజన్ మొదలై రెండు నెలలు పూర్తవుతున్నా రైతుభరోసా జాడ లేదు.
హామీ నెరవేరదేమీ
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ‘రైతుభరోసా’లో ఏటా ఎకరానికి రూ.15వేలు ఇస్తామని ఆరు గ్యారంటీల్లో హామీ ఇచ్చారు. కానీ అది అమలు కావడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా రూ.12వేలు పంట కాలానికి అనుగుణంగా ఫసల్కు ఎకరాకు రూ.6వేల చొప్పున అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీని అమలు చేయకుండా ఏటా ఎకరానికి రూ.12వేలు ఇస్తుంది. అది కూడా ఈ రబీ సీజన్లో ఆలస్యమైంది. ఈ సీజన్కు ఎకరానికి రైతుభరోసాగా వచ్చే రూ.6వేల కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. వెంటనే ప్రభుత్వం రైతుభరోసా అందించాలని జిల్లా రైతులు కోరుతున్నారు.
రైతుభరోసా స్వరూపం ఇదీ..
అందని రైతు భరోసా


