మెనూ ప్రకారం భోజనం పెట్టాలి
● వాటర్ప్లాంట్ను వినియోగంలోకి తేవాలి ● గురుకుల పాఠశాలను
తనిఖీ చేసిన కలెక్టర్
సిరిసిల్లఅర్బన్: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. నిత్యావసరాల స్టాక్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని నిర్వాహకులను మందలించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధి పెద్దూరులోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను గురువారం కలెక్టర్ అనురాగ్ జయంతి తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరుశాతాన్ని పరిశీలించారు. 427 మందికి 361 మంది విద్యార్థులు ఉన్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. వంట గదిని పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. నిత్యావసరాల స్టాక్ రిజిస్టర్ పరిశీలించి, అప్డేట్ లేకపోవడంతో నిర్వాహకులను మందలించారు. వాటర్ప్లాంట్కు మరమ్మతులు చేసి, వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు. మిషన్ భగీరథ నీటి కనెక్షన్ ఇవ్వాలని, మరుగుదొడ్లను పరిశీలించి నల్లాలకు మరమ్మతు చేయాలని సూచించారు. తరగతిగదుల్లో బోధనతీరును పరిశీలించి, విద్యార్థులకు బెడ్స్, ఫ్యాన్స్ ఏర్పాటు చేయాలన్నారు. శాశ్వత భవన నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో వివరాలు అందజేయాలని ప్రిన్సిపాల్కు సూచించారు.