మద్దిపాడు: ఇండియా అల్ట్రా మారఽథాన్ రన్నర్ సూఫియా సూఫి రన్ ఫర్ డ్రీమ్స్ పేరుతో నిర్వహిస్తున్న మారథాన్ శనివారం ఉదయం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని గుండ్లాపల్లి వద్దకు చేరుకుంది. మే నెల 12వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి లద్ధాఖ్లోని చైనా సరిహద్దు కారకోరం పాస్ వరకూ మారథాన్ చేస్తున్నారు. సుమారు 5 వేల కిలో మీటర్ల ప్రయాణం 11 రాష్ట్రాల ద్వారా 88 రోజుల వ్యవధిలో పూర్తి చేసి సరికొత్త గిన్నిస్ రికార్డు నెలకొల్పేందుకు నిశ్చయించుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ మారథాన్ రన్ను భారత సాయుధ బలగాలకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. రోజుకు 65 నుంచి 80 కిలోమీటర్ల వరకూ రన్నింగ్ చేస్తూ ఆమె లక్ష్యం వైపు దూసుకుపోతున్నారు.
రాజస్థాన్లోని అజ్మీర్కు చెందిన సూఫియాసూఫి గతంలో మారథాన్ రన్నర్గా ఐదు గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన హిమాలయ మార్గాల్లో ఒకటైన మనాలి నుంచి లేహ్ వరకూ 480 కిలోమీటర్ల దూరాన్ని 98.2 గంటల్లో పూర్తి చేసి కొత్త రికార్డు నెలకొల్పారు. అదే విధంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ 4 వేల కిలోమీటర్ల దూరాన్ని అత్యంత తక్కువ రోజుల్లో పరుగులు తీసి పూర్తి చేసి గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకున్నారు. దేశంలోని నాలుగు మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, చైన్నె, కోల్కతాలను కలిపే 6 వేల కిలోమీటర్ల సుదూర మార్గాన్ని గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రన్ పేరుతో అత్యంత వేగంగా పరుగెత్తి మరో గిన్నిస్ రికార్డును తన ఖాతాలో జమ చేసుకున్నారు. సియాచిన్–కార్గిల్, లెంగ్త్ ఆఫ్ ఖతార్ మారథాన్తో మరో రెండు గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకున్నారు.


