మహిళపై భర్త, అత్తమామల దాడి
ఒంగోలు టౌన్: అత్తమామలతో కలిసి తన భర్త వేధిస్తున్నాడని, భర్త, మరిది, అత్తమామలు కలిసి తనతో బలవంతంగా మత్తు మాత్రలు మింగించి ఇంటి నుంచి గెంటేశారని వివాహిత ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి కథనం మేరకు వివరాలు.. విజయవాడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి షేక్ నశీర్ అహ్మద్, హుసేన్ బీ దంపతులకు ఇద్దరు సంతానం. పెద్దమ్మాయి షేక్ మనీషాను ఒంగోలు సీతారామపురంలో నివాసం ఉండే షేక్ బిస్మిల్లా కుమారుడు ఆరీఫ్ అల్లాకు ఇచ్చి 2021లో వివాహం చేశారు. వివాహ సమయంలో 50 సవర్ల బంగారు నగలు, వేరు కాపురానికి రూ.10 లక్షల నగదు ఇచ్చారు. రూ.50 లక్షలు ఖర్చు చేసి అట్టహాసంగా వివాహం జరిపించారు. బీటెక్ చదువుకున్న ఆరీఫ్ ఉద్యోగం చేయకుండా తండ్రి నిర్వహించే రెస్టారెంట్, వడ్డీ వ్యాపారాలు చూసుకుంటుంటాడు. చెడు వ్యసనాలకు బానిసైన ఆరీఫ్ భార్యతో సరిగా కాపురం చేయకపోవడంతో మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ క్రమంలో విడాకుల కోసం సంతకం చేసి వెళ్లి పోవాలని మనీషాను వేధించసాగాడు. దీంతో మనీషా పుట్టింటికి చేరింది. గత ఏడాది డిసెంబర్లో తిరిగి అత్తారింటికి వచ్చింది. అయినప్పటికీ వేధింపులు మానలేదు. దీంతో కొద్ది రోజులుగా తల్లి హుసేన్ బీ కూతురికి తోడుగా ఒంగోలుకు వచ్చి ఉంటోంది. ఎలాగైనా సరే మనీషాను వదిలించుకోవాలని భావిస్తున్న ఆరీఫ్, అతని తల్లిదండ్రులు, తమ్ముడు మరికొందరితో కలిసి ఆదివారం దాడికి పాల్పడ్డారు. మనీషాతో బలవంతంగా మత్తు మాత్రలు మింగించారు. ఆమె తల్లి హుసేన్బీని ఇంటి బయటకు గెంటేశారు. ప్రస్తుతం మనీషా జీజీహెచ్లో చికిత్స పొందుతోంది. దాడిపై బాధితులు ఒంగోలు వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె మనీషాను అత్తామామలు వేధిస్తున్నట్లు ఆమె తలిదండ్రులు ఫిర్యాదు చేశారని, విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని వన్టౌన్ సీఐ నాగరాజు తెలిపారు.


