ఇలాంటి కందిపప్పుతో వండి పెడుతున్నారా...
అంగన్వాడీలపై జేసీ ఆగ్రహం మరోసారి జరిగితే సస్పెండ్ చేస్తా
ఉలవపాడు: ‘‘ఇలాంటి కందిపప్పు పిల్లలకు వండి పెడుతున్నారా... మనల్ని నమ్మి వచ్చిన పిల్లలను ఇలా చేస్తారా’’ అంటూ అంగన్వాడీ కార్యకర్తలపై జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి మండిపడ్డారు. శుక్రవారం మండల పరిధిలోని భీమవరం గ్రామంలోని మూడో అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. తనిఖీకి వెళ్లిన సమయంలో డబ్బాలో ఉన్న కందిపప్పు పాడైపోయి ఉండడాన్ని ఆమె గమనించారు. ఈ కందిపప్పుతో ఎలా పెడతారు... మన పిల్లలకు అయితే ఇలాంటి పప్పు పెడతారా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి బయటపడేయడానికి అక్కడ పెట్టామని కార్యకర్త కామాక్షి, ఆయా ఒకరిమీద ఒకరు చెప్పుకోవడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా జరిగితే ఒప్పుకోనన్నారు. ఇంతదారుణంగా ఉంటే మీరేం చేస్తున్నారని సీడీపీఓ మాధవీలత, సూపర్వైజర్ రమాదేవిని అడిగారు. ఈసారి ఎవరికీ చెప్పకుండా తనిఖీలు చేస్తాను... ఇలా ఉంటే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రం పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడాన్ని ఆమె గమనించి అంగన్వాడీ కేంద్రాలు ఇంత దారుణంగా ఉంటే ఎలా అన్నారు. పరిశుభ్రత గురించి ఎందుకు తెలియచేయడం లేదని ఏఎన్ఎంను అడిగారు. గ్రామ పరిధిలో పారిశుధ్యం సక్రమంగా లేదని మరోసారి అలా ఉండకూడదని పంచాయతీ కార్యదర్శి అంజయ్యను హెచ్చరించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న రీసర్వేను పరిశీలించారు. భూముల రీసర్వే జాగ్రత్తగా చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ఆమె వెంట సబ్కలెక్టర్ హిమవంశీ, తహశీల్దార్ శ్రీనివాసరావు తోపాటు సిబ్బంది ఉన్నారు.
నాసిరకం కందిపప్పు పై ముందే తెలిపిన సాక్షి...
రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు నాసిరకంగా ఉందని నెల క్రితమే ‘సాక్షి’ మెయిన్ పేజీలో కథనం ప్రచురితమైంది. ఆ సమయంలో అధికారులు ఆ తప్పును కప్పి పుచ్చడానికి అందరిచేత బాగున్నాయని చెప్పించడం, టీడీపీ నాయకులచేత అద్భుతంగా ఉన్నాయని సీడీపీఓ, సూపర్వైజర్లు చెప్పించారు. కానీ ఈ రోజు జేసీ కల్పనా కుమారి తనిఖీలో కందిపప్పు నాణ్యత బట్టబయలైంది.


