
ఇరిగేషన్లో అవినీతి ప్రవాహం
మార్కాపురం టౌన్:
నీటిపారుదల (ఇరిగేషన్) శాఖలో ఓ అవినీతి ఉద్యోగి బాగోతం వెలుగుచూడటంతో అతని కార్యాలయంతో పాటు నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అవసరమైన రికార్డులు తీసుకెళ్లారు. మార్కాపురంలోని ఇరిగేషన్ ఇంజినీరింగ్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ కె.శ్రీనివాసరావు సోమవారం రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఎస్.శిరీష ఆధ్వర్యంలో రెడ్హ్యాండెడ్గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఇరిగేషన్ శాఖలో 30 లక్షల రూపాయల విలువైన మూడు వర్కులను కాంట్రాక్టర్ ఏరువ శ్రీనివాసరెడ్డి పూర్తి చేశారు. అయితే, సదరు బిల్లులు అప్లోడ్ చేసేందుకు రూ.30 వేల లంచం ఇవ్వాలని నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ కె.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ శ్రీనివాసరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారు రూ.30 వేల విలువైన 500 రూపాయల నోట్లను కాంట్రాక్టర్కు ఇచ్చి సోమవారం ఉదయం ఇరిగేషన్ కార్యాలయానికి పంపారు. ఆ నగదును శ్రీనివాసరావు తీసుకుంటున్న సమయంలో అక్కడే మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కార్యాలయంలో శ్రీనివాసరావు పరిధిలో ఉన్న రికార్డులను పరిశీలించారు. అలాగే మార్కాపురంలోని బొమ్మరిల్లు అపార్టుమెంటులో ఆయన ఉంటున్న ఫ్లాట్లో కూడా తనిఖీలు చేశారు. శ్రీనివాసరావును ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. అధికారులు, ఉద్యోగులు లంచాలు డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులను ప్రజలు సంప్రదించాలని ఏసీబీ డీఎస్పీ శిరీష సూచించారు. సమాచారం తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు శేషు, రమేష్బాబు, ఎస్సైలు మస్తాన్ షరీఫ్, ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
ఏసీబీ దాడులతో అధికారుల్లో ఆందోళన...
ఏసీబీ అధికారులు మార్కాపురం వచ్చారన్న సమాచారంతో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు ఆందోళనకు గురయ్యారు. ఏఏ శాఖలపై దాడిచేస్తారోనన్న భయంతో మానసిక ఒత్తిడికి లోనయ్యారు. వివిధ కార్యాలయాల్లో ఎక్కువగా లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉండటంతో ఏసీబీ అధికారులు ఎప్పుడు దాడులు చేస్తారోనన్న ఆందోళన వారిలో మొదలైంది.
ఏసీబీకి పట్టుబడిన సీనియర్ అసిస్టెంట్ ఇంట్లోనూ సోదాలు
అవసరమైన రికార్డులు తీసుకెళ్లిన ఏసీబీ అఽధికారులు
వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ శిరీష

ఇరిగేషన్లో అవినీతి ప్రవాహం