
ప్రజలను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం
పొదిలి: రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలను గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాల్లో మునిగి తేలుతోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి అన్నా రాంబాబు విమర్శించారు. పార్టీ మీడియా సెల్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు’ అనే పుస్తకాన్ని అన్నా రాంబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం కోసమే చంద్రబాబు నాయుడు అలవికాని హామీలు ఇచ్చారన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం ఎక్కువగా పచ్చ చొక్కాలకే లబ్ధి చేకూర్చేలా వ్యవరిస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి, ప్రజల దృష్టిని మరల్చాలని చూస్తున్నారన్నారు. ఎవరు ఏమి హామీలు ఇచ్చారు, ఎవరి పరిపాలనలో హామీలు చక్కగా అమలయ్యాయో ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు. కేవలం ప్రజలను భ్రమల్లో ఉంచేందుకు పీ–4 పథకం అమలు చేస్తామని చెబుతున్నారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజాభిమానం పొందాలే తప్ప, హామీలపై ప్రశ్నిస్తే ఓర్చుకోలేని స్థితిలో పాలకులు ఉండటం సరికాదన్నారు. సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేర్చామని చెప్పడం మరింత విడ్డూరంగా ఉందన్నారు. ఏ హామీని ఎప్పుడు నెరవేర్చారు, ఎవరు లబ్ధిపొందారో అర్థం కావటం లేదన్నారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, అధికార ప్రతినిధి మెట్టు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో కార్యకర్తల్లో ఆత్మ స్థైర్యం నింపాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి, అన్ని రకాలుగా నష్టపోయిన కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారన్నారు. అక్రమ కేసులను లీగల్ సెల్ సాయంతో ఎదుర్కొందామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడం శోచనీయమన్నారు. అప్పులు చేయడం ఒక్కటే కూటమి ప్రభుత్వ ఘనత అని ఎద్దేవా చేశారు. పుస్తకావిష్కరణ అనంతరం కార్యకర్తలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కొనకనమిట్ల ఎంపీపీ మోరబోయిన మురళి, జెడ్పీటీసీ సభ్యుడు అక్కిదాసరి ఏడుకొండలు, పార్టీ మండల మాజీ కన్వీనర్ గుజ్జుల సంజీవరెడ్డి, రైతు విభాగం నాయకుడు కె.సుబ్బారావు, పార్టీ నాయకులు శింగారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, పేరం సుభాష్రెడ్డి, పేరం నాగిరెడ్డి, అన్నవరం బ్రహ్మారెడ్డి, బేతా ప్రకాశ్రెడ్డి, తిరుమలరెడ్డి నాగిరెడ్డి, కొండాయపాలెం నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి అన్నా రాంబాబు
5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు
పుస్తకావిష్కరణ