
చేపల వేటకు ఆదిలోనే హంసపాదు
సింగరాయకొండ: సముద్రంలో చేపల వేట నిషేధ కాలం ముగిసింది... వేట లాభదాయకంగా ఉంటుందని ఆశించిన మత్స్యకారులు ఆదిలోనే హంసపాదుతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేట నిషేధకాలంగా ప్రభుత్వం నిర్ణయించింది. వేట నిషేధకాలం పూర్తవటంతో మత్స్యకారులు తీరంలో చేపల వేట ఆశాజనకంగా ఉండాలని పూజలు నిర్వహించారు. అయితే ప్రతి సంవత్సరం నిషేధకాలం పూర్తయిన తరువాత మొదటి రోజు చేపల వేట ఆశాజనకంగా ఉంటుందని ప్రతి ఒక్క బోటుకు 20 నుంచి 30 వేల వరకు చేపలు లభించేవని పాకల గ్రామంలోని మత్స్యకారులు తెలిపారు. కానీ ఈ సంవత్సరం మాత్రం కేవలం 6 నుంచి 10 వేల వరకు మాత్రమే చేపలు లభించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా చేపలు 100 నుంచి 150 కేజీలు లభించేవని, ఈసారి మాత్రం 15 నుంచి 20 కేజీలు లభించాయన్నారు. అయితే ఈసారి వంజరం రకం చేపలు లభించటంతో పాటు వాటి ధర కేజీ రూ.400 ఉండటం కొంత వరకు పరవాలేదని, అదే ఇతర రకాలైతే అవి కేజీ రూ.100 నుంచి రూ.200 మాత్రమే ఉండేవని తీవ్రంగా నష్టపోయేవారమని మత్స్యకారులు తెలిపారు.
వాతావరణ ప్రభావంతో అలల ఉధృతి:
వాతావరణ ప్రభావంతో సోమవారం అలల ఉధృతి బాగా ఉండటంతో ఒక్క పడవ కూడా వేటకు వెళ్లలేదని మత్స్యకారులు తెలిపారు. మొదటిరోజు వేట సరిగా లేదని, రెండో రోజు అసలు వేటే లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక పక్క పెరిగిన కరెంటు బిల్లులు, నిత్యావసర ధరలతో, స్కూలు ఫీజులతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆశాజనకంగా లేని చేపల వేట
వాతావరణ ప్రభావంతో ఉధృతంగా సముద్రపు అలలు
అలల ఉధృతితో ఆగిన చేపల వేట
వేట సరిగా లేక ఆందోళనలో మత్స్యకార కుటుంబాలు