
సీసీ రోడ్డు పగులకొట్టారు
● ‘మీ కోసం’లో కలెక్టర్కు కొత్తపట్నం
ఎంపీపీ లంకపోతు ఫిర్యాదు
ఒంగోలు సబర్బన్: కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో సిమెంట్(సీసీ) రోడ్డును అక్రమంగా పగులగొట్టారని కొత్తపట్నం మండల వైఎస్సార్ సీపీ నాయకుడు, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి కలెక్టరేట్లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాను కలిసి వినతి పత్రం ఇచ్చారు. సీసీ రోడ్డు పగుల గొట్టిన తీరును వివరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజా ధనంతో నిర్మించిన సీసీ రోడ్డును అధికార టీడీపీకి చెందిన నాయకుడు బంకా శ్రీనివాసులు కావాలని పగులగొట్టాడని వివరించారు. సీసీ రోడ్డు పగులగొట్టటంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఆటంకంగా మారిందని వివరించారు. సీసీ రోడ్డును పగులగొట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని, రోడ్డుకు జరిగిన నష్టాన్ని వారి నుంచే వసూలు చేసి రోడ్డును పునరుద్ధరించాలని కలెక్టర్ను కోరారు. కలెక్టర్ను కలిసిన వారిలో అల్లూరు ఎంపీటీసీ సభ్యుడు శాంతారావు, అల్లూరు సర్పంచ్ సూర్య నారాయణ ఉన్నారు.
సమస్యలు వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్
ప్రజల నుంచి వచ్చిన అర్జీలకు సంబంధించిన సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్లోని మీ కోసం సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణతో కలిసి వినతులు స్వీకరించారు. పీజీఆర్ఎస్లో అందిన అర్జీలను నాణ్యతతో నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అర్జీల పరిష్కార ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, శ్రీధర్, జాన్సన్, విజయజ్యోతి లతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.