రైతుల కోసం కేసులకై నా వెనుకాడం | - | Sakshi
Sakshi News home page

రైతుల కోసం కేసులకై నా వెనుకాడం

Jun 17 2025 6:49 AM | Updated on Jun 17 2025 6:49 AM

రైతుల కోసం కేసులకై నా వెనుకాడం

రైతుల కోసం కేసులకై నా వెనుకాడం

ఒంగోలు టౌన్‌: గిట్టుబాటు ధరలు రాక ఇబ్బంది పడుతున్న రైతుల కోసమే మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పర్యటనను భగ్నం చేయడానికే టీడీపీ కుట్రపూరితంగా రాళ్లదాడి చేసిందని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి ఆరోపించారు. రైతుల కోసం ఎన్ని కేసులు పెట్టినా వెనకాడేది లేదని స్పష్టం చేశారు. అక్రమ కేసులతో అణచివేయాలని చూస్తే భయపడేది లేదని, మరింత క్రియాశీలకంగా పనిచేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులో అరెస్టయి జిల్లా జైలులో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను పార్టీ నాయకులు జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్‌ మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్‌ అన్నా రాంబాబు, ఒంగోలు, చీరాల నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జ్‌లు చుండూరి రవిబాబు, కరణం వెంకటేష్‌, పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్నలతో కలిసి ఆయన సోమవారం పరామర్శించారు. అనంతరం బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పొదిలి పర్యటనలో జగన్‌తో తమ సమస్యలను చెప్పుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలి వచ్చారని తెలిపారు. పోలీసుల అనుమతి తీసుకున్న తరువాతనే పోరుబాట ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా ర్యాలీలో టీడీపీ వర్గీయులు నిరసనలకు దిగారని, ర్యాలీని భగ్నం చేయాలన్న కుట్రతోనే రాళ్లదాడికి దిగారని తెలిపారు. ర్యాలీని భగ్నం చేయడానికి ప్రయత్నించిన వారిపై కేసులు పెట్టకుండా ర్యాలీకి వచ్చిన రైతులు, వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడం అక్రమమని తీవ్రంగా ఖండించారు. సుమారు 3 కేసులు నమోదు చేసి 30 మందికి పైగా అరెస్టు చేయడం బాధాకరమన్నారు. మేము రాళ్లదాడి చేయలేదని, టీడీపీ వారే చేశారని ఎస్పీకి వివరించినట్లు తెలిపారు. రాళ్లదాడి చేసిన టీడీపీ కార్యకర్తల మీద కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. నిస్పక్షపాతంగా విచారణ చేయాలని ఎస్పీని కోరినట్లు చెప్పారు.

జగన్‌ పొదిలి పర్యటనతోనే కేంద్రంలో చలనం

పొగాకు రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారికి మద్దతు తెలిపేందుకే జగన్‌ పొదిలి పర్యటనకు వచ్చారని బూచేపల్లి చెప్పారు. దీని వల్లనే కేంద్ర మంత్రి హడావుడిగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారన్నారు. పొగాకు కొనుగోళ్ల కోసం కేంద్రం నుంచి రూ.150 కోట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారని తెలిపారు. ఒక వేళ కేంద్ర ప్రభుత్వ నిధులు రావడం ఆలస్యమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించి పొగాకు రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. పొగాకు రైతులకు మద్దతుగా వైఎస్సార్‌ సీపీ పోరాటం చేయకపోతే, జగన్‌ పొదిలి పర్యటకు రాకపోతే కేంద్ర మంత్రి ఏపీకి వచ్చేవారా అని ప్రశ్నించారు. రైతుల సమస్యలు, ప్రధానంగా పొగాకు రైతుల బాధలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి పోయేవి కాదని అన్నారు. ఇప్పటికీ రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కనిగిరి, పెద్దారవీడు ప్రాంతాల్లో రైతులు రోడ్డెక్కి నిరసనలకు దిగారని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో గిట్టుబాటు ధరలు లభించక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోరుబాటలో రాళ్లదాడి విషయంలో పొదిలి సీఐ తనకు నోటీసులు ఇచ్చారని, దానికి సాయంత్రం లోపు సమాధానం ఇవ్వనున్నట్లు తెలిపారు. బూచేపల్లి వెంట పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రమణా రెడ్డి, లీగల్‌సెల్‌ అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, పీడీసీబీ మాజీ చైర్మన్‌ వైఎం ప్రసాద్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

పొదిలి ర్యాలీలో అనుమతులు లేకుండానే టీడీపీ నిరసనల పేరుతో రాళ్లదాడి రాళ్లదాడి చేసిన వారిని వదిలేసి బాధితుల మీదనే అక్రమ కేసులు అణిచేసేకొద్దీ మరింత ఉత్సాహంగా పనిచేస్తాం వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి జిల్లా జైలులో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలకు పరామర్శ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement