
తల్లికి వందనంపై వచ్చే అర్జీలను పరిష్కరించాలి
ఒంగోలు సబర్బన్: తల్లికి వందనం పథకం కింద వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. సోమవారం మండల స్థాయి అధికారులతో పలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రకాశం భవనం నుంచి జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణతో కలిసి ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లికి వందనం పథకంలో ఆర్థిక ప్రయోజనం దక్కలేదంటూ వచ్చే అర్జీలను తల్లికి వందనం పథకం కింద లబ్ధిదారుల వివరాలను, అనర్హుల వివరాలను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పారు. అర్హత ఉన్నప్పటికీ తమకు ప్రయోజనం కలగలేదని, అర్జీలు వస్తే వాటిని తక్షణమే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈనెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో 10 లక్షల మంది ప్రజలతో యోగాసనాలు వేయించేలా ఇస్తున్న శిక్షణలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న అందరూ పాల్గొనేలా చూడాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ చెప్పారు. ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ అనుబంధ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో జెడ్పీ సీఈవో చిరంజీవి, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, డీపీఓ గొట్టిపాటి వెంకట నాయుడు, బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, స్టెప్ సీఈవో శ్రీమన్నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.