
కూటమి పాలనలో పెరిగిన అరాచకాలు
ఒంగోలు టౌన్: కూటమి ఏడాది పాలనలో రోజురోజుకూ అరాచకాలు, అక్రమాలు పెరిగిపోయాయని, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, విద్యా, వైద్య రంగాలతో పాటుగా వ్యవసాయం సంక్షోభంలో పడ్డాయని మాజీ మంత్రి, బాపట్ల జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు మేరుగు నాగార్జున విమర్శించారు. కూటమి పాలన గురించి ప్రచురించిన వెన్నుపోటు పుస్తకాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మాట్టాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎవరు ప్రశ్నించినా వారిపై ఎడాపెడా కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో ఒక చిన్నారిపై 18 మంది అత్యంత క్రూరంగా అత్యాచారం చేస్తే పరామర్శించడానికి వెళ్లిన వైఎస్సార్ సీపీ నాయకులపై కేసులు పెట్టారని, ఒక గిరిజన బాలికను దారుణంగా హత్య చేశారని, రాజమండ్రిలో దళిత మహిళను అవమానించారని తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. యథేచ్ఛగా కేసులు పెడుతున్నారని, ఎస్సీ ఎస్టీ మైనారిటీల మీద దాడులతో పేట్రేగి పోతున్నారని చెప్పారు. సోషల్ మీడియా పేరుతో ప్రశ్నించే గళాలను కేసులతో వేధిస్తున్నారన్నారు. పొదిలి ర్యాలీ విషయంలో రైతులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం కక్షసాధింపు చర్యలకు పరాకాష్టగా చెప్పవచ్చన్నారు. పొదిలి పర్యటన కోసం పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ముందుగానే పోలీసుల అనుమతి తీసుకున్నారని తెలిపారు. పోలీసుల అనుమతితో ర్యాలీ నిర్వహిస్తే టీడీపీ కార్యకర్తల చేత రాళ్లు వేయించి తిరిగి వైఎస్సార్ సీపీ కార్యర్తల మీదనే కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి మచ్చగా నిలుస్తోందన్నారు.
ప్రజలను మోసగించడం ఎల్లకాలం నడవదు: బత్తుల
మాయమాటలతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసగించడం ఎల్లకాలం నడవదని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానంద రెడ్డి అన్నారు. చంద్రబాబు పాలనలో ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర రావడంలేదని, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవారికే పథకాలను అందజేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల విషయంలో అన్నీ వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడతామని, జైలుకు పంపిస్తామని ప్రజల్లో భయాందోళన సృష్టించడం ప్రజాస్వామ్యాన్ని హతమార్చడమేనని చెప్పారు. పొగాకు రైతులకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో పొదిలి పర్యటనకు జగన్ వచ్చారని చెప్పారు.
తప్పులను తప్పకుండా అనుభవిస్తారు: చుండూరి
రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు వేధింపులకు గురిచేస్తోందని పార్టీ ఒంగోలు ఇన్చార్జ్ చుండూరి రవిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరుబాట ర్యాలీలో పాల్గొన్న పార్టీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించారన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలతో జైళ్లను నింపేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు కనకరావు మాదిగ, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు కఠారి శంకర్, సంతనూతలపాడు నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు పమిడి వెంకటేశ్వర్లు, ఎన్.కృష్ణారెడ్డి, దుంపా చెంచిరెడ్డి, పిచ్చిరెడ్డి, శ్రీరామమూర్తి, కోటి రెడ్డి, తన్నీరు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
పొగాకు రైతులకు ధైర్యం చెప్పడానికి వస్తే రైతులు, పార్టీ కార్యకర్తల మీద కేసులు విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలను నాశనం చేసిన కూటమి పాలకులు మాజీ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజం