
టీడీపీ నాయకుడి స్థల దాహం
సాక్షి టాస్క్ఫోర్స్: దర్శి నగరపంచాయతీ ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను తొలగించి ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు కూటమి నాయకులు సిద్ధమయ్యారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు సాగిస్తున్న అక్రమ దందాను చూసి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో నియోజకవర్గ టీడీపీ నేతకు ముడుపులందినట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. దర్శిలోని నిమ్మల బావి సమీపంలో ఆర్వో ప్లాంట్ను ఓ టీడీపీ నాయకుడు జేసీబీతో కూలగొట్టి చదును చేశాడు. నగర పంచాయతీ అధికారుల సహకారంతోనే ఆ స్థలాన్ని టీడీపీ నాయకుడు ఆక్రమించుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగర పంచాయతీ నడిబొడ్డున ఉన్న ఈ స్థలం విలువ సుమా రూ.25 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. ప్రస్తుత దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి తండ్రి మాజీ ఎమ్మెల్యే దివంగత బూచేపల్లి సుబ్బారెడ్డి దర్శి ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వ, నగర పంచాయతీ నిధులు వెచ్చించి ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశారు. అప్పటి వైఎస్సార్ సీపీ సర్పంచ్ చంద్రగిరి గురవారెడ్డి వాటర్ప్లాంటు ద్వారా తాగునీరు అందించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్లాంట్ స్థలంపై కన్నేసిన ఆ పార్టీ నాయకులు ప్లాంటును నిర్వీర్యం చేశారు. ఇప్పుడు ఏకంగా స్థలాన్నే కబ్జా చేశారు. మరమ్మతులకు గురైన వాటర్ ప్లాంటును పునరుద్ధరించి తాగునీటి సమస్య పరిష్కరించాల్సిన నగర పంచాయతీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా ఆక్రమణలకు సహకరించడంపై స్థానికులు మండిపడుతున్నారు.
దర్శిలోని నిమ్మలబావి సమీపంలో
ఆర్వో ప్లాంట్ కూల్చివేత
రూ.25 లక్షల విలువైన స్థలాన్ని కొట్టేసిన టీడీపీ నాయకుడు
అక్రమార్కుడికి అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారం

టీడీపీ నాయకుడి స్థల దాహం