ఒంగోలు సిటీ: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యత అని, ప్రకాశం జిల్లాను బాలకార్మికులు లేనిదిగా రూపొందించాలని జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ వి.రామాంజనేయులు, ఐసీడీఎస్ పీడీ కె.మాధురి పేర్కొన్నారు. బుధవారం ఒంగోలు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో అంతర్జాతీయ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ‘బాల కార్మికత్వాన్ని అంతం చేద్దాం’ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాల కార్మికులను గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థ పెను సవాలుగా మారిందని, బాలల భద్రతకు ముప్పు కలుగుతోందన్నారు. బాలలు జీవించే హక్కును కాపాడాలని చెప్పారు. బాలలను పనిలో పెట్టుకునేవారికి జైలు శిక్ష, జరిమానా తప్పవని హెచ్చరించారు. జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం జూన్ 30 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో బాల కార్మికులను గుర్తిస్తే చైల్డ్ హెల్ప్లైన్ 1098 లేదా 18001027222కు ఫోన్ చేసి సమాచారం చెప్పవలసిన బాధ్యత సమాజంలో పౌరులందరి మీద ఉందన్నారు. కార్యక్రమంలో డీసీపీఓ పి.దినేష్కుమార్, శిశుసంక్షేమ శాఖ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ శైలజ, బాలల సంరక్షణ అధికారి కె.శేఖర్బాబు, ఎల్సీపీఓ బి.ప్రభాకర్, చిల్డ్రన్ హోమ్ సూపరింటెండెంట్ జీవిత, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ నెల 30 వరకు బాలకార్మికుల గుర్తింపునకు స్పెషల్ డ్రైవ్
పోస్టర్ ఆవిష్కరణలో బాలల సంక్షేమ కమిటీ చైర్మన్, ఐసీడీఎస్ పీడీ
Comments
Please login to add a commentAdd a comment