తాడేపల్లి : తాను చేయనిది కూడా చేశానని నిస్సిగ్గుగా చెప్పుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడేనని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత టీజీఆర్ సుధాకర్బాబు విమర్శించారు. చంద్రబాబు అబద్దాల కోరని, ఆయన చేసిందేమైనా ఉంటే ఆధారాలతో చూపించగలరా? అంటూ సవాల్ విసిరారు.
ఈరోజు(శుక్రవారం, ఆగస్గు 28వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. క్రెడిట్ చోరీకి పాల్పడటం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయిందని ధ్వజమెత్తారు. ‘ చంద్రబాబు అబద్దాల కోరు. తాను చేయనిది కూడా నిస్సిగ్గుగా చెప్పుకునే వ్యక్తి చంద్రబాబు. 1996లో వెలిగొండకు శంకుస్థాపన చేశాక ప్రాజెక్టు కోసం ఏమీ చేయలేదు. 9 ఏళ్లపాటు సీఎంగా ఉన్నా ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు, శంకుస్థాపన సభ కోసం అప్పట్లో రూ.11 లక్షలు ఖర్చు పెట్టారే తప్ప ప్రాజెక్టుకు పైసా ఖర్చు చేయలేదు.
వైఎస్సార్ హయాంలో రెండు టన్నెళ్లలో 20.3 కి.మీ. తవ్వకాలు చేశారు. తర్వాత చంద్రబాబు హయాంలో కేవలం 6.6 కి.మీ.లు మాత్రమే పనులు జరిగాయి. అనంతరం జగన్ వచ్చాక 10.5 కి.మీ టన్నెళ్లు తవ్వించారు. రెండేళ్లపాటు కరోనాతో తీవ్ర ఇబ్బందులు తలెత్తినా పనులు ఆపలేదు. వెలిగొండకు ఎవరేం చేశారో చర్చకు వచ్చే దమ్ముందా?, టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలలో గెలవగలరా?, ఆ ప్రాంతంలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల రెఫరెండం పెట్టే దమ్ముందా?,
చంద్రబాబు చేసిందేమైనా ఉంటే ఆధారాలతో చూపించగలరా?, నిర్మాణం చేయకుండానే ప్రారంభోత్సవాలు చేయటం చంద్రబాబుకు అలవాటు. అమరావతికి ఇప్పటికీ కనెక్టివిటీ రోడ్లు లేవు. కానీ ఏదేదో చేసినట్టు ఎల్లోమీడియా ద్వారా విస్తృత ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు వెలిగొండ విషయంలోనూ అదే చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు కూడా న్యాయం చేయని వ్యక్తి. కేవలం రూ.112 కోట్లు చెల్లిస్తే రైతులకు మేలు జరుగుతుంది. అమరావతిలో పూలమొక్కలకు వందల కోట్లు చేస్తున్నారేగానీ నిర్వాసితులకు మాత్రం పైసా విదల్చటం లేదు. బాధితులు ఆత్మహత్యాయత్నం చేస్తున్నా చంద్రబాబుకు మనసు కరగడం లేదు’ అని విమర్శించారు.
ఇదీ చదవండి:
నిమ్మల రామానాయుడికి చేదు అనుభవం


