ఆ లెక్కలు బయటపెట్టాలి: సాకే శైలజానాథ్‌ | Ysrcp Leader Sake Sailajanath On Chandrababu Extravagant Spending | Sakshi
Sakshi News home page

ఆ లెక్కలు బయటపెట్టాలి: సాకే శైలజానాథ్‌

May 13 2026 4:51 PM | Updated on May 13 2026 4:59 PM

Ysrcp Leader Sake Sailajanath On Chandrababu Extravagant Spending

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దుబారా ఖర్చులతో రాష్ట్రం అతలాకుతలమవుతుందని.. దీనిపై చర్చించాలంటే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమరావతిలో సాధారణ ప్రజలు నివసించే పరిస్థితి లేదన్నారు.

‘‘పార్లమెంటు భవనం, తెలంగాణ సెక్రటేరియట్‌కు కూడా కాని ఖర్చు అమరావతిలో చేస్తున్నారు. అడుగుకు రూ.16 వేలు ఖర్చు చేయటం దుబారా కాదా?. రూ.20 కోట్లతో అయ్యే రోడ్డును వంద కోట్లకు చేయటం చంద్రబాబుకే చెల్లు. అమరావతిలో పెడుతున్న ఖర్చులు చూసి రాయలసీమ వాసులు ఆందోళన చెందుతున్నారు. అమరావతి అద్దాలకే రూ.2,700 కోట్లు ఖర్చు చేస్తారా?. నీళ్లు ఎత్తిపోయటానికే రూ.800 కోట్లు ఖర్చు చేస్తారా?. అమరావతిలో జరుగుతున్న అవినీతి, దుబారాని వెంటనే ఆపాలి

..కేంద్ర సెక్రటేరియట్ నిర్మాణాన్ని కూడా తాత్కాలికంగా ఆపారు. అమరావతి నిర్మాణాలపై నిర్ణయం తీసుకోండి. ముందుగా మొక్కజొన్న రైతులకు ఆ డబ్బు చెల్లించండి. చంద్రబాబు తన దుబారా ఖర్చులను రైతులకు ఉపయోగించాలి. ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్ల ప్రయాణాన్ని ఆపాలి. అధికారులు, మంత్రులు కూడా దబారా ఖర్చులు తగ్గించాలి. రాజధాని పేరుతో వసూలు చేసిన బంగారం, డబ్బు లెక్కలు బయట పెట్టాలి. జనం నుండి వసూలు చేసిన ఆ డబ్బు, బంగారం ఎక్కడ ఉన్నాయి?’’ అంటూ శైలజానాథ్‌ నిలదీశారు.

‘‘ఎంఎస్ఎంఈలకు ఇవ్వాల్సిన సబ్సిడీలు కూడా వెంటనే ఇవ్వాలి. పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈవెంట్ లాగా చేస్తూ దుబారా ఖర్చులు పెడుతున్నారు. వైఎస్‌ జగన్ ప్రారంభించిన ప్రాజెక్టులను మళ్లీ మళ్లీ ప్రారంభించటం దుబారా కాదా?. ప్రధాని రెండు వాహనాల్లో వెళ్లినందున చంద్రబాబు ఒక్క ఆరులో వెళ్లి పబ్లిసిటీ చేసుకుంటారు. వర్క్ ఫ్రం హోమ్ అనేది కరోనా టైంలో వచ్చింది. చివరికి దాన్ని కూడా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు పాలనతో అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం జిల్లాలో చెట్లు నాటించింది తానేనని చెప్పుకున్నారు. శ్రీకాకుళం నుండి రాయలసీమకు వర్షపు నీరు పంపుతారట. ఇలాంటి డైలాగులు, అబద్దపు ప్రచారాలు ఆపాలి’’ అని సాకే శైలజానాథ్‌ ధ్వజమెత్తారు.

Advertisement
 
Advertisement
Advertisement