తిరుపతి: వేంకటేశ్వరస్వామితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెలగాటమాడుతున్నారని, న్యాయస్థానాలను అవహేళన చేస్తూ ఏకసభ్య కమిషన్ నియమించారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై సీబీఐ, సిట్ విచారణలు తమ కనుసన్నల్లో జరపలేదని, తాను ఆశించిన విధంగా విచారణ జరగలేదు కాబట్టే.. మళ్లీ ఏకసభ్య కమిషన్ నియమించారని భూమన విమర్శించారు.
‘గులాం చేసే వాళ్లతో ఏకసభ్య కమిషన్ వేయడం అంటే ఏమని అర్థం చేసుకోవాలి. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట సమయంలో ఏకసభ్య కమిషన్ నియమించి ఏం చేశారో మనం చూశాం. ఇప్పుడు మళ్లీ ఏకసభ్య కమిషన్ వేశారు. దీన్ని పూర్తిగా రాజకీయ ఎత్తుగడగానే భావిస్తున్నాం. ఇది ఆశ్చర్యం కల్గిస్తుంది. 45 రోజుల పాటు వన్మేన్ కమిషన్ నియమించారు.
రాజకీయ డ్రామా ఆడటానికి కొత్త నాటకానికి తెరలేపుతున్నారు. 45 రోజల పాటు తాను అనుకున్న మీడియా ద్వారా అసత్య కథనాలు నడిపేందుకు సన్నద్ధమవుతున్నారు. మమ్మల్ని దోషులుగా ముద్ర వేయడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. వన్మేన్ కమిషన్ చైర్మన్గా చంద్రబాబు మీరే ఉంటే సరిపోతుంది కదా.. ’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


