తాడేపల్లి: కూటమి సర్కారు వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ ద్వజమెత్తారు. ప్రభుత్వ పెద్దలు మాత్రం ప్రత్యేక విమానాల్లో తిరగడానికే సరిపోతుందని, ప్రజలకు మాత్రం ఎలాంటి మేలు జరగడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో పసిపిల్లపై అఘాయిత్యాల జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు జూపూడి. టీటీడీ లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని, అది కాస్తా భూమ్రాంగ్ అయ్యి హెరిటేజ్ దగ్గర ఆగిందన్నారు. లడ్డూ విషయంలో తప్పంతా చంద్రబాబుదేనని తేలిపోయిందన్నారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం గాడి తప్పి అస్తవ్యస్తంగా పరిపాలన చేస్తోంది. చంద్రబాబు పరిపాలన పబ్లిసిటీ పీక్..పర్ఫార్మెన్స్ వీక్గా ఉంది. కూటమి నేతలు నిత్యం జగన్ నామ స్మరణ, వైఎస్సార్సీపీ నేతలపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజలు ఎప్పుడు అడిగినా కేసులు, అరెస్టులు, డైవర్షన్ చేస్తున్నారు. కూటమి పాలన గురించి వైఎస్ జగన్ సుదీర్ఘంగా వివరించారు. జగన్ ప్రెస్ మీట్ను ప్రజలు క్షుణ్ణంగా వినాలని, నిజాలను తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో గవర్నెన్స్ ఉందా లేదా అని వైఎస్ జగన్ ప్రశ్నిస్తే.. ఇప్పటి వరకు సమాధానం లేదు.
జగన్ను తిట్టడానికే మంత్రులకు శాఖలు కేటాయించారు. గిరిజన పాఠశాలలు, హాస్టల్స్, ఆసుపత్రుల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత 900 మంది పిల్లలు అనారోగ్యంతో చనిపోయారు. లోకేష్ నేతృత్వంలో విద్యా వ్యవస్థ నాశనమైంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విధానంపైనే ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. అదే విషయాన్ని పరకాల ప్రభాకర్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు లక్షల ఓట్లు ఎలా పోల్ అయ్యాయనే అంశంపై అనేక అనుమానాలు ఉన్నాయి.ఒకే అబద్దాన్ని పదే పదే చెబుతూ గ్లోబల్ ప్రచారంతో ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు.
పరిపాలన గాలికి వదిలేసి హెలికాప్టర్, ప్రత్యేక విమానాల్లో పర్యటనలు చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు నిత్యం ప్రత్యేక విమానాల్లోనే తిరుగుతున్నారు. క్రికెట్ మ్యాచ్లు, విదేశీ విహార యాత్రలకు ప్రత్యేక విమానాల్లో పర్యటిస్తున్నారు. ఎవరి ఖర్చులతో తిరుగుతున్నారు అని అడిగితే సమాధానం ఇవ్వడం లేదు. 99 పైసలకే భూములు తీసుకున్న వారు స్పెషల్ ఫ్లైట్స్ పెడుతున్నారా అని ప్రశ్నిస్తున్నాను.ఆకాశంలో విహరించడం మానేసి భూమి మీదకు వచ్చి ప్రజల సమస్యలను పరిష్కరించండి’ అని జూపూడి డిమాండ్ చేశారు.


