కేసీఆర్‌వి దొంగ ధర్నాలు: షర్మిల 

Telangana: YSRTP YS Sharmila Alleged On CM KCR - Sakshi

రఘునాథపాలెం: వడ్ల కొనుగోళ్ల అంశంపై ఢిల్లీలో సంతకాలు చేసిన సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు దొంగ ధర్నాలు చేస్తున్నారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయా త్ర శనివారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పడమటి తండా వద్ద ప్రారంభమైంది. తర్వాత జాన్‌బాద్‌ తండా, సీతారాంపురం క్రాస్, రైల్వే కాలనీల మీదుగా పాపటపల్లి చేరుకుంది.

అక్కడ ఆమె రైతు దీక్ష చేపట్టారు. అనంతరం యాత్ర కామేపల్లి మండలానికి చేరుకుంది. యాత్ర 50వ రోజుకు చేరడంతో ప్రజలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. పాపటపల్లి గ్రామంలో వడ్ల కొనుగోళ్లపై రైతులతో షర్మిల మాట్లాడారు. పరిపాలన చేయాలని కేసీఆర్‌కు ప్రజలు అధికారమిస్తే ధర్నాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్‌ సూచనతో రైతులు వరి వేయకపోవడంతో అటు రైతులు, ఇటు కూలీలకు ఉపాధి లేకుండా పోయిందని అన్నారు.

సీఎం సంతకం పెట్టినందుకే కేంద్రం వడ్లు కొనేది లేదని చెబుతోందని, ఆ సంతకం ఎవరిని అడిగి చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ తీరుతో మిల్లర్లు క్వింటాలుకు రూ.500 నుంచి రూ.600 మేర ధర తగ్గించి రైతులను దోచుకునేందుకు పన్నాగం పన్నారని ఆరోపించారు. ఇకనైనా కేసీఆర్‌ కొనుగోలు కేంద్రాలు తెరిచి మద్దతు ధరతో ధాన్యం కొనాలని డిమాండ్‌ చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top