
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి బాయిల్డ్ బియ్యం కొనుగోలు చేసేది లేదని రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెగేసి చెప్పినందున ఈ అంశంలో బీజేపీ నేతలు తమ వైఖరి వెల్లడించాలని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఖరీఫ్ సీజన్ లక్ష్యాన్ని తెలంగాణ చేరుకోలేదని, యాసంగి సంగతి తర్వాత ఆలోచిద్దామని చెబుతూ కేంద్ర ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతోందని పేర్కొన్నారు.
తెలంగాణ నుంచి యాసంగి ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం వైఖరి వెల్లడైనందున కేంద్ర మంత్రి కిషన్రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ రైతులకు రూ.10వేల కోట్ల సబ్సిడీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రైతుల కోసం రూ.25 వేల కోట్లు ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.