గెహ్లాత్ ప్రభుత్వం ఉంటుందా.. ఊడుతుందా..!
రాజ్భవన్ వేదికగా సాగుతున్న హైడ్రామా
అసెంబ్లీ సమావేశపరచండి: మంత్రిమండలి తీర్మానం
గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ
జైపూర్ : ఎడారి రాష్ట్రం రాజస్తాన్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఎంతకీ వీడటంలేదు. నిన్నటి వరకు రిసార్టులు, న్యాయస్థానాల వేదికగా చోటుచేసుకున్న హైడ్రామా తాజాగా గవర్నర్ అధికారికి నివాసమైన రాజ్భవన్కు చేరింది. హైకోర్టు ఉత్తర్వుల నేపపథ్యంలో తిరుగుబాటు నేతల నుంచి తమ ప్రభుత్వానికి ముంపు పొంచి ఉందన్న విషయాన్ని పసిగట్టిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ పరిస్థితి చేయిదాటకముందే బల నిరూపణ చేసుకోవాలని వ్యూహాలు రచించారు. అయితే కాంగ్రెస్ ప్రయత్నాలకు గవర్నర్ కల్రాజ్ మిశ్రా మోకాలొడ్డుతున్నారు. ప్రస్తుతమున్న కోవిడ్ పరిస్థితుల్లో అసెంబ్లీని సమావేశపరిచేలా చర్యలు తీసుకోలేనని తేల్చిచెప్పారు. దీంతో అధికార పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా.. అదికాస్తా రాజ్భవన్ ఎదుట ధర్నాకు దారితీసింది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి అత్యవసరంగా మంత్రివర్గాన్ని సమావేశపరిచిన గెహ్లాత్.. శాసనసభను సమావేశపరచాలని తీర్మాన్నించారు. (రాజ్భవన్ ఎదుటే బైటాయింపు)
గవర్నర్కు వేరే మార్గం లేదు..
అంతేకాకుండా అసెంబ్లీలో తనకు 102 మంది సభ్యుల మద్దతుందని గవర్నర్కు విన్నపించారు. ఈ నివేదికను శనివారం ఉదయమే గవర్నర్కు పంపనున్నారు. మరోవైపు రాజస్తాన్ గవర్నర్ తీరుపై పలువురు విశ్లేషకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే సమస్య ఉత్పన్నమైనప్పడు కర్ణాటకలో వ్యవహరించిన రీతిలో ఇక్కడ గవర్నర్ వ్యహరించకపోవడానికి రాజకీయ పరమైన ఒత్తిడే కారనమని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యక్షంగా తలదూర్చలేని కేంద్రం గవర్నర్ను పావుగా ఉపయోగించుకుని గెహ్లాత్ వ్యూహాలకు చెక్పెడుతుందన్న విమర్శా వినిపిస్తోంది. మరోవైపు అసెంబ్లీని సమావేశపర్చే విషయంలో మంత్రి మండలి సిఫారసులను ఆమోదించడం మినహా గవర్నర్కు వేరే మార్గం లేదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. (రాజస్తాన్ సంక్షోభం : పైలట్కు భారీ ఊరట)
సర్కార్ ఊడుతుందా..?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 175 ప్రకారం నడుచుకుంటానని చివరకు గవర్నర్ హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ ఆగ్రహం కొంత చల్లబడినట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశంపై శనివారం మధ్యాహ్నంలోపు గవర్నర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని సీఎం భావిస్తున్నారు. ఈ మేరకు బలపరీక్షకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అధికార పార్టీకి చెందిన 19 మంది సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉంటడంతో గెహ్లాత్ భవిష్యత్ అంతా స్వతంత్ర ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్లింది. వారి నిర్ణయంపైనే సర్కార్ ఊడుతుందా..? నిలబడుతుందా అనేది ఆధారపడి ఉంది.