35 మందిని ఒకేసారి విలీనం చేసుకోండి | Raghunandan Rao comments on CM Revanth | Sakshi
Sakshi News home page

35 మందిని ఒకేసారి విలీనం చేసుకోండి

Jul 15 2024 3:45 AM | Updated on Jul 15 2024 3:45 AM

Raghunandan Rao comments on CM Revanth

సీఎం రేవంత్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొంటున్నారు  

బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ధ్వజం 

గజ్వేల్‌రూరల్‌/ప్రశాంత్‌నగర్‌: ‘బావ, బామ్మర్ది, మామ (హరీశ్, కేటీఆర్, కేసీఆర్‌).. ముగ్గురిని వదిలేసి, 35 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ ఒకేసారి విలీనం చేసుకోవాలి’అని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు వ్యంగ్యంగా అన్నా రు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో మహంకాళీ బోనాల ఉత్సవాలకు హాజరైన ఆయన అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, రాజ్యాంగంపై ప్రమాణం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. సంతలో పశువులను కొన్నట్లు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొంటున్నారని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లో రాజ్యాంగ విలువల గురించి మట్లాడుతూ, ఇక్కడ రేవంత్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనడాన్ని ఎందుకు చెక్‌ పెట్టలేకపోతున్నారని ప్రశ్నించారు. ఒక సీఎం వేరే పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు కండువా కప్పిన మరుక్షణం ఆ ఎమ్మెల్యేను డిస్‌క్వాలిఫై చేయాలని కర్ణాటకలో హైకోర్టు తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. ఈ విషయంలో తెలంగాణ న్యాయ మూర్తులు, సుప్రీంకోర్టు జడ్జీలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.  

పాలనపై దృష్టిపెట్టాలి..:బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పార్టీ ఫిరాయింపులపై కాకుండా పరిపాలనపై సీఎం దృష్టి సారించాలని ఎంపీ రఘునందన్‌రావు హితవు పలికారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రభుత్వంలో నంబర్‌ టూగా చెలామణి అవుతున్న మంత్రి, బీఆర్‌ఎస్‌ బెదిరింపులు ఆపేదాక ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఉంటాయనడం సరికాదన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement